PM Modi Vizag Tour Schedule: జూన్ 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఈసారి సాగరతీరం వైజాగ్ ముస్తాబైంది. యోగాంధ్ర పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈమేరకు ఆయన పర్యటన షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం ఒడిశా పర్యటనలో ఉన్న మోదీ.. భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6.40 గంటలకు విశాఖ విమానశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని ఆఫీసర్స్ మెస్కు పయనమవుతారు.
ఈ సందర్భంగా గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, ఇతర నాయకులు మోదీకి స్వాగతం పలుకుతారు. అనంతరం రాత్రికి అతిథి గృహంలో బస చేస్తారు. శనివారం ఉదయం 6.25 గంటలకు రోడ్డు మార్గంలో ఆర్కే బీచ్కు చేరుకుంటారు. ఉదయం 6.30 నుంచి 7.50 గంటల వరకు యోగా విన్యాసాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొననున్నారు. ఈ యోగా ప్రదర్శనలో సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. యోగా విన్యాసాల అనంతరం ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.
ప్రసంగం అనంతరం ఆర్కే బీచ్ నుంచి బయలుదేరి తూర్పు నౌకాదళ ఆఫీసర్స్ మెస్కు వెళతారు. అక్కడ నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత ఉదయం 11.25 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, 11.50 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. కాగా యోగాంధ్ర- 2025 కోసం ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు 26 కిలోమీటర్ల మేర వేదికలు సిద్ధం చేశారు. అన్ని వేదికల వద్ద మ్యాట్లు, విద్యుద్దీపాలు, ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఆంధ్రా యూనివర్సిటీలో ప్రత్యామ్నాయ వేదికను కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యకమానికి ప్రధాని మోదీతో పాటు వీవీఐపీలు తరలివస్తుండటంతో వైజాగ్ పోలీసుల నిఘా నీడలోకి వెళ్లిపోయింది.