Girls Died: కష్టపడి చదివి ఇంటర్మీడియట్ పరీక్షలను రాశారు. పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడేందుకు, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు అలా జలపాతానికి వెళ్లారు. కాసేపు సరదాగా గడిపారు. ఆ సందడి క్షణాలను తమ స్మార్ట్ఫోన్లలో బంధించాలని ఉత్సాహంతో ఉన్నారు. కానీ ఆ ఉత్సాహమే వారి ఊపిరి తీసింది. ఆ గంగమ్మ వారిని తనలో కలుపుకొనేలా చేసింది. కన్నవారికి కన్నీటిని మిగిల్చింది. ఏపీలో జరిగిన ఈ దుర్ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో సెల్ఫీ సరదా ముగ్గురు యువతుల ప్రాణాలను బలితీసుకుంది. అనంతగిరి మండలం మూలగుమ్మి జలపాతం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుకుంపేట మండలం జుంబువలస గ్రామానికి చెందిన త్రిష(17), రత్నకుమారి (16), పవిత్ర(16).. ఇటీవలే ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం మరో బాలిక అంజలి కలిసి నలుగురూ కలిసి మూలగుమ్మి జలపాతం వద్దకు విహారయాత్రకు వెళ్లారు. జలపాతం వద్ద సెల్ఫీలు దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/indecent-comments-on-renu-desai-accused-arrested-in-guntur/
గమనించిన స్థానికులు వారిని కాపాడేలోపు త్రిష, రత్నకుమారి, పవిత్ర జలపాతంలో కొట్టుకునిపోయి మృతి చెందారు. అంజలిని స్థానికులు రక్షించగలిగారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో లుంగపర్తిలోని ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరీక్షల ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సంతోషంగా గడపడానికి వెళ్లిన తమ పిల్లలు విగతజీవులుగా తిరిగి రావడంతో జుంబువలస గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

