Today AP Cabinet meeting : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం నేడు జరుగనుంది. సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో.. పలు కీలక అంశాలపై చర్చజరిగే అవకాశం ఉంది. మంత్రులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
పంట నష్టంపై ప్రధాన చర్చ: సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశం జరగనుంది. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగే ఈ సమవేశానికి ఏర్పాట్లు పూర్తి అయినట్టుగా అధికారులు తెలిపారు. ఇటీవల మొంథా తుపాను మిగిల్చిన పంట నష్టంపై కేబినెట్ ప్రధానంగా చర్చించనుంది. ఈ సందర్భంగా నష్టపోయిన రైతులకు ఇచ్చే పరిహారంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అమరావతి అభివృద్ధికి రుణం: అమరావతి రాజధాని నిర్మాణం, అభివృద్ధి కోసం ఆర్థిక వనరుల సమీకరణపై చర్చ జరగనుంది. ముఖ్యంగా నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ నుంచి దాదాపు రూ. 7500 కోట్ల రుణ ప్రతిపాదనకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై కేబినెట్ అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా సీఐఐ సమ్మిట్కు సంబంధించిన అంశాలపై సైతం కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరు, అలాగే వాటి కోసం నిధుల సమీకరణపై తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్లో చర్చ జరగనుంది. కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి లేదా సంబంధిత మంత్రులు తీసుకున్న నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది.


