Srivari Darshan: వేసవిసెలవులు కావడంతో కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లు కిక్కిరిసిపోయాయి. ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 8 గంటల సమయానికి ఉచిత దర్శనం కోసం కంపార్టుమెంట్లన్నీ భక్తులతో ఫుల్ అయిపోయాయి.
దర్శన సమయాల వివరాలు: రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి సుమారు 18 నుండి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం టోకెన్లు ఉన్నవారికి దర్శనం కోసం 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. రూ. 300 శీఘ్రదర్శనం కోసం 3 నుండి 5 గంటల్లో దర్శనం పూర్తవుతోంది. రద్దీ దృష్ట్యా భక్తులు ఓపికతో వ్యవహరించాలని, క్యూలైన్లలో ఉన్న వారికి టీటీడీ పానీయాలు, ఆహార సౌకర్యాలను నిరంతరం అందిస్తోందని అధికారులు తెలిపారు.
రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం: బుధవారం రోజున తిరుమలలో భక్తుల తాకిడి రికార్డు స్థాయిలో నమోదైంది. మొత్తం 98,058 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకుని 49,234 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారికి రికార్డు స్థాయిలో రూ. 4.09 కోట్ల ఆదాయం సమకూరింది.

