PM Modi visit srisailam temple: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. అర్చకులు, ఆలయ అధికారులు మోదీకి పూర్ణకుంభంతో లాంఛనంగా స్వాగతం పలికారు. అనంతరం భ్రమరాంబాదేవి సమేత మల్లికార్జున స్వామివారికి ప్రధాని మోదీ పూజలు చేశారు. మల్లన్నకు పంచామృతాలలో రుద్రాభిషేకం, భ్రమరాంబకు ఖడ్గమాల, కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సైతం మోదీ సందర్శించనున్నారు. ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.
ఒకే హెలికాప్టర్లో ముగ్గురు: ఉదయం ప్రధాని మోదీ కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు స్వాగతం పలికారు. కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీ..హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. మోదీతో పాటుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఒకే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. అనంతరం శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను ప్రధాని మోదీ దర్శించుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Also read: https://teluguprabha.net/andhra-pradesh-news/pm-modi-tweet-in-telugu-on-andhra-pradesh-tour/
జీఎస్టీ 2.0పై కర్నూలులో సభ: కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించి చెప్పేందుకు పీఎం మోదీ ఏపీ వచ్చారు. ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో గురువారం జరిగే బహిరంగసభకు సుమారు మూడు లక్షల మంది హాజరవుతారని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఈ సభకు కర్నూలు శివారులోని నన్నూరు వేదిక కానుంది. ఇక్కడ సుమారు 450 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లుచేశారు. వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా 40 ఎకరాల్లో 4భారీ టెంట్లు వేశారు. ఇక్కడి నుంచే ప్రధాని నరేంద్రమోదీ రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.


