weather Forecast Update: రానున్న నాలుగు రోజుల తర్వాత దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇది మంగళవారం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం సైతం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పిడుగులతో కూడిన వానలు: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నేడు తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం ప్రభావం పెరిగే కొద్దీ వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. నేడు బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
మోస్తరు నుంచి భారీ వానలు: ఈ నెల 22న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 23న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, గుంటూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురవొచ్చని వాతారణ శాఖ అధికారులు తెలిపారు.
పిడుగుల హెచ్చరిక: ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


