Weather report: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు అకాల వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్నఅత్యధికంగా కర్నూలులో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మామిడి రైతుల్లో ఆందోళన: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రానున్న నాలుగు రోజుల్లో ద్రోణిగా బలపడనుంది. దీని ప్రభావంతో ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈ అకస్మాత్తు మార్పులు వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా మామిడి రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రైతులకు కోలుకోలేని దెబ్బ: ఎండల వల్ల ఇప్పటికే మామిడి పిందెలు రాలిపోతున్నాయి. ఇప్పుడు అకాల వర్షాలు తోడైతే రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేసింది. వర్ష సూచన ఉన్నందున తోటల్లో మందుల పిచికారీని తాత్కాలికంగా ఆపాలని పేర్కొంది. వర్షం వల్ల తేమ పెరిగి తెగుళ్లు సోకే ప్రమాదం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. తోటల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈదురు గాలుల వల్ల కాయలు రాలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

