ఇటీవల తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య తీవ్ర విభేదాలు తలెత్లిన సంగతి తెలిసిందే. థియేటర్ల బంద్ అంశం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రకంపనలు రేపింది. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసేస్తామని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదలకు కొన్ని రోజులకు ముందే థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించడంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఇండస్ట్రీ పెద్దలపై అసహనం వ్యక్తం చేస్తూే ఓ లేఖ విడుదల చేశారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు సినీ ప్రముఖులు ముందుకు రాకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం సినీ రంగాన్ని, అగ్ర నటులను ఎలా ఇబ్బందులకు గురి చేసిందో అప్పుడే మరిచిపోయారా అని ప్రశ్నించారు. సినీ పరిశ్రమ నుంచి అందిన ఈ ‘రిటర్న్ గిఫ్ట్’ను తగిన రీతిలోనే స్వీకరిస్తామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి సినిమా టెకెట్ల ధరల పెంపు, ఇతరత్రా సమస్యలపై ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కలవకూడదని.. సినిమా సంఘాల ద్వారానే కలవమని ఆదేశించారు. పవన్ ఆగ్రహంతో ఇండస్ట్రీ పెద్దలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తమకు థియేటర్ల బంద్ నిర్ణయానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
ఏపీలోతెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వివాదాలకు ఎండ్ కార్డ్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో సినీ పరిశ్రమ పెద్దలు భేటీ కానున్నారు. ఈ నెల 15వ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. దీనిని పరిశీలించిన ముఖ్యమంత్రి కార్యాలయం ఈ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా నేతృత్వం వహించనున్నారు.
ఈ సమావేశంలో దాదాపు 30 మంది వరకు సినీ రంగ ప్రముఖులు సీఎంను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా సినిమా నిర్మాణం, రాష్ట్రంలో షూటింగ్లకు అనుమతులు, లొకేషన్ సమస్యలు, పన్నుల అంశాలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల నియంత్రణ వంటి కీలక విషయాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీతో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు, వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Tollywood: సీఎం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీకి ముహూర్తం ఖరారు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES