Mithun Reddy Pitision Trail in ACB Court: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి వేసిన పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టు వాదనలు ముగిసాయి. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బ్లాక్లో తగిన వసతులు లేకపోవడం గురించి కోర్టుకు నివేదించారు. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని జూలై 19న ఎస్ఐటీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టు ఆయనను ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్కు పంపింది.
ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు జైలు సదుపాయాలపై పిటిషన్ దాఖలు చేయగా, మంగళవారం జరిగిన విచారణలో ఏసీబీ కోర్టు జడ్జి జైలు అధికారులను ప్రశ్నించారు. “ఒక పార్లమెంటు సభ్యుడికి అందాల్సిన వసతులు కల్పిస్తున్నారా?” అని కోర్టు ప్రశ్నించగా, జైలు అధికారులు “కోర్టు ఆదేశాల మేరకు పాటిస్తాము” అని సమాధానం ఇచ్చారు. దీనిపై జడ్జి స్పందిస్తూ, “చట్టాలు రూపొందించే వ్యక్తికి తగిన వసతులు కల్పించాలి కదా” అని వ్యాఖ్యానించారు.
వాదనలు ముగియడంతో కోర్టు తీర్పును రిజర్వ్లో ఉంచింది. ఇదే రోజు సాయంత్రంలోగా తీర్పు వెలువడే అవకాశం ఉంది. మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ‘స్నేహా బ్లాక్’లో ఉంటున్నారు. అయితే ఆయన తరపు న్యాయవాదులు అక్కడ తగిన మౌలిక సదుపాయాలు లేవని కోర్టు దృష్టికి తీసుకురాగా, జైలు అధికారులు మాత్రం అవసరమైన వసతులన్నీ కల్పించామని పేర్కొంటున్నారు.


