తిరుమలలో(Tirumala) టీటీడీ(TTD) నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ విరాళాలపై టీటీడీ బోర్డ్ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) కీలక ప్రకటన చేశారు. అన్న ప్రసాదం ట్రస్ట్ విరాళాలు ఇప్పటివరకు రూ.2,200 కోట్లు దాటాయని వెల్లడించారు.
1985 సంవత్సరంలో తిరుమలలో అన్నదాన స్కీమ్ను నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు (NT Rama Rao) ప్రారంభించారని గుర్తు చేశారు. 2014లో దానిని శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్గా టీటీడీ పేరు మార్చిందని తెలిపారు. నాడు 2వేల మందితో ప్రారంభమై, నేడు రోజుకు లక్ష మంది భక్తులకు అన్నవితరణ చేసే స్థాయికి ట్రస్ట్ అభివృద్ధి చెందిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్లో అత్యధికంగా 9.7 లక్షల మంది దాతలు కలిగి ఉన్నారని తెలిపారు.
అలాగే కోటి రూపాయలు లేదా అంతకుమించి విరాళమిచ్చిన దాతలు సంఖ్య 139కి చేరిందన్నారు. ఇక ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు అయ్యే ఖర్చు రూ.44 లక్షలు కాగా.. విరాళమిచ్చిన దాతలు 249కి చేరిందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నప్రసాదంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ప్రస్తుతం భక్తులకు మరింత రుచిగా, శుచిగా ఉండే అన్నప్రసాదం వితరణ చేస్తున్నామని ప్రకటించారు. అంతేగాక భోజనం మెనూలో శెనగ వడలను భక్తులకు వడ్డిస్తున్నామని, టీటీడీ అన్నప్రసాదంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని వివరించారు.