విశాఖ శ్రీ శారదాపీఠానికి టీటీడీ(TTD) మరోసారి నోటీసులు ఇచ్చింది. తిరుమలలో(Tirumala) నిర్మించిన భవనాన్ని 15 రోజుల్లో ఖాళీ చేయాల్సిందేనని నోటీసుల్లో పేర్కొంది. తిరుమలలోని స్థానిక గోగర్భం డ్యామ్ సమీపంలో చేపట్టిన శారదా పీఠం భవనం నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. దీంతో హిందూ ధర్మ పరిరక్షణ సంఘాలు మఠం ఎదుట ఆందోళన చేపట్టాయి. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాం శారదపీఠానికి అనుకూలంగా ఉండటంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శారదాపీఠం మఠంకు చెందిన భవన నిర్మాణంలో ఆక్రమణలు, అవకతవకలు జరిగినట్లు టీటీడీ అధికారుల కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా టీటీడీ ఎస్టేట్ విభాగం అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై శారదాపీఠం నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే నిబంధనలను మఠం ఉల్లంఘించిందని గుర్తించిన న్యాయస్థానం చర్యలు తీసుకునే అధికారం టీటీడీకి ఉందని తీర్పు ఇచ్చింది. దీంతో 15 రోజుల్లో మఠం ఖాళీ చేసి భవనాన్ని అప్పగించాలని టీటీడీ ఎస్టేట్ విభాగం నోటీసులు జారీ చేసింది.