TTD Srivani Darshan tickets: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శన టికెట్ల కేటాయింపులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పలు కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో పెడుతోంది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలలు ముందుగానే ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్కు అవకాశం కల్పిస్తుంది. మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద జారీ చేస్తోంది. అయితే, ప్రస్తుతం రోజువారీ కరెంట్ బుకింగ్ కోటాలో అందుబాటులో ఉన్న 800 దర్శన టికెట్ల పట్ల టీటీడీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం చెల్లించి దర్శన టికెట్ బుక్ చేసుకునే దాతలకు 300 టికెట్లు ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయించింది.
Also Read: Minister Uttam: అవన్నీ ఫేక్ ప్రచారాలు.. దేశంలోనే అత్యధిక ధాన్యం కొనుగోళ్లు చేస్తుంది మనమే..!
జూన్ 10 నుంచి కొత్త విధానం అమల్లోకి..
ఈ సదుపాయం 2025 మే 1 నుంచి విరాళం చెల్లించిన అర్హులైన దాతలకు మాత్రమే వర్తించనుందని టీటీడీ స్పష్టం చేసింది. ఈ టికెట్లు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదల చేస్తామని.. మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకున్న భక్తులకు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది. కాగా, ఈ నూతన విధానం జూన్ 10 నుంచి అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. ఒకవేళ, ఈ కోటాలో కేటాయించిన 300 టికెట్లలో బుక్ అవ్వని టికెట్లను కరెంట్ బుకింగ్ కోటాలో యాడ్ చేస్తామని తెలిపింది. ఈ విధానం 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

