Thursday, June 26, 2025
Homeఆంధ్రప్రదేశ్Plane Crash: నా తండ్రి కూడా ప్రమాదంలోనే చనిపోయారు: రామ్మోహన్ నాయుడు

Plane Crash: నా తండ్రి కూడా ప్రమాదంలోనే చనిపోయారు: రామ్మోహన్ నాయుడు

Ram Mohan Naidu on Air India plane crash: అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదం(Plane Crash) యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ప్రమాదాల్లో చనిపోతే ఆ కుటుంబం అనుభవించే బాధ తనకు తెలుసు అని.. తన తండ్రి ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి తన మనసు ఎంతో భారంగా ఉందన్నారు.

విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాద స్థలాన్ని పరిశీలించానని పేర్కొన్నారు. పౌర విమానయాన శాఖ ఈ ప్రమాదాన్ని చాలా సీరియస్ గా తీసుకుందన్నారు. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ వేశామన్నారు. హోంశాఖ కార్యదర్శి, సివిల్ ఏవియేషన్ సెక్రటరీ, గుజరాత్ అధికారులు, అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ , స్పెషల్ డైరెక్టర్ ఐబీని కమిటీలో నియమించామన్నారు మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి ఈ కమిటీ నివేదిక ఇస్తుందన్నారు.

ఇక బ్లాక్ బాక్స్ ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అందులో ఉన్న సమాచారం కీలకంగా మారనుందని చెప్పుకొచ్చారు. ప్రమాదం తెలిసిన వెంటనే బోయింగ్ 787 సిరీస్ కు చెందిన విమానాలను పరిశీలించాల్సిందిగా DGCAకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రమాదం జరిగిన 24 గంటల్లోనే ప్రధాని మోదీ ఘటనా స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. ప్రస్తుతం మృతుల కుటుంబాలకు డీఎన్ఏ పరీక్షలు జరుగుతాయని.. ఈ ఫలితాలు రాగానే మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తామని వెల్లడించారు.

కాగా ఈనెల 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే క్రాష్ అయిన విషయం విధితమే. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది చనిపోగా.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బతికారు. ఇక సమీపంలోని బీజీ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై విమానం కూలడంతో 33 మంది మెడికోలు సైతం మరణించారు. ఇందులో 24 మంది స్పాట్ లోనే చనిపోగా.. మిగిలిన ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News