విజయవాడ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ చేరుకోనున్నారు.
బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు లంచ్ కి ఆహ్వానించారని కిషన్ రెడ్డి తెలిపారు.. రాష్ట్రానికి కేంద్ర సహాయం, ఏపీకి రావాల్సిన ప్రాజెక్ట్ లపై చర్చించామని పేర్కొన్నారు. వీటితో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా రాజకీయ అంశాలపై చర్చించినట్టు వెల్లడించారు.
అంతకుముందు ఎన్డీయే ప్రభుత్వం 11 ఏళ్ల పాలన విజయవంతంపై దేశ వ్యాప్తంగా బీజేపీ 11 ఏళ్ల సేవ పేరుతో కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని అన్నారు. గత 11 ఏళ్లలో మోడీ ప్రభుత్వం మీద ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఇది దేశ ప్రజల నమ్మకానికి నిదర్శనమన్నారు. మోడీ పాలనలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు.
కరోనా కష్టకాలంలో రైతులను కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందన్నారు. దేశ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నామని వివరించారు. తమ నిర్ణయాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్వదేశి టెక్నాలజీతో తయారు చేసిన వందే భారత్ రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం తీసుకొచ్చామని, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎయిర్పోర్టుల సంఖ్య పెంచామని కిషన్ రెడ్డి తెలిపారు.
Kishan Reddy: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భేటీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES