Amaravathi: ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంలో కీలక అడుగు పండింది. బుధవారం లోక్సభలో ‘ఏపీ పునర్విభజన సవరణ చట్టం’ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో ఈ బిల్లుపై చర్చించేందుకు స్పీకర్ ఓంబిర్లా అనుమతిచ్చారు. మొదటగా గంట సమయాన్ని కేటాయించిన స్పీకర్.. అవసరమైతే మరో గంట పొడిగిస్తామని ప్రకటించారు.
ఆంధ్రుల కల సాకారం: బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. అమరావతి ఆంధ్రుల కలల రాజధాని అని అన్నారు. ఏపీకి అమరావతిని ఏకైక రాజధానిగా ఏర్పాటు చేయడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు. వికేంద్రీకరణ పేరుతో గత ప్రభుత్వం మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిందని విమర్శించారు. ఈ చట్టసవరణతో అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందా? లేదా? అన్న అనుమానాలకు పూర్తిస్థాయిలో ముగింపు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also read-Ontimitta: నేడు ఒంటిమిట్టకు సీఎం చంద్రబాబు దంపతులు
కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు: అమరావతికి చట్టబద్ధత కల్పించే ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ లోక్సభలో వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ఏపీ రాజధాని అంశానికి మద్దతు లభించింది. దీంతో బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం లోక్సభలో మూజువాణి ఓటుతో దీనిని ఆమోదించనున్నారు. అనంతరం ఈ బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకురానున్నారు. ఈ బిల్లు చట్టరూపంలోకి వస్తే ఏపీ రాజధానిగా అమరావతికి పార్లమెంటరీ స్థాయి రక్షణ లభించనుంది.

