Monday, June 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Piyush Goyal: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ

Piyush Goyal: సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ

Piyush Goyal Meet CM Chandrababu: ఏపీ పర్యటనలో భాగంగా ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాయలంలో సీఎం చంద్రబాబును కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి చర్చించారు.

హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపుపై చర్చించారు. అలాగే టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వినతిపత్రం అందించారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏడు చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.

పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే రూ. 300 కోట్లలో టొబాకో బోర్డు రూ.150 కోట్లు భరించేలా చూడాలని కోరీరు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్టసవరణ చేయాలని విన్నవించారు. ఆయిల్ పాం దిగుమతి సుంకాన్ని 10 శాతానికి తగ్గించడంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. దిగుమతి సుంకం తగ్గించడం వల్ల రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని.. దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుచేశారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాల విషయంలో ఆ దేశంతో చర్చలు జరపాలని సూచించారు. సీఫుడ్ పై అమెరికా విధించిన 27 శాతం సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతోందని ఆయన వెల్లడించారు. ఏపీ ఆక్వా రైతులపై ఈ భారాన్ని తగ్గించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా మ్యాంగో పల్ప్ పై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు పీయూష్ గోయల్ కు సీఎం చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News