ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓడిపోయారు. తొలుత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అయితే ఇందులో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. ఈ క్రమంలో రెండో ప్రాధాన్య ఓట్లతో పీఆర్టీయూ గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.
తొలి ప్రాధాన్యత ఓట్లలో శ్రీనివాసులు నాయుడుకు 7,210 ఓట్లు, రఘువర్మకు 6,845 ఓట్లు వచ్చాయి. యూటీఎఫ్ అభ్యర్థి విజయగౌరికి 5,804 ఓట్లు వచ్చాయి. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మ్యాజిక్ ఫిగర్ 10,068 ఓట్లు ఎవరికీ రాకపోవడంతో.. అధికారులు రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించారు. ఈ క్రమంలో మిగతా అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. రెండో రౌండ్లో శివప్రసాదరావు, మూడో రౌండ్లో పద్మావతి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో రౌండ్లో రాధాకృష్ణ, ఐదో రౌండ్లో సత్యనారాయణ, ఆరో రౌండ్లో శ్రీనివాసరావు, ఏడో రౌండ్లో దుర్గాప్రసాద్, ఎనిమిదో రౌండ్లో సూర్యప్రకాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. చివరకు రఘువర్మ, శ్రీనివాసులు నాయుడు పోటీలో మిగలగా.. రెండో ప్రాధాన్యత ఓట్లతో శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు.
సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు టీడీపీ, జనసేన పార్టీలు బహిరంగంగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడుకు బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం మద్దతుగా నిలిచింది. పీడీఎఫ్ అభ్యర్థి విజయగౌరికి వామపక్షాలు, యూటీఎఫ్ సంఘీభావం తెలిపాయి.