నకిలీ ఇళ్ల పట్టాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వంశీకి తక్షణ వైద్య చికిత్స అవసరమన్న వాదనతో హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం, ఆయనకు మెరుగైన చికిత్స అందించాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
వంశీ తరఫు న్యాయవాది విజ్ఞప్తి మేరకు, విజయవాడలోని ఆయుష్ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తగిన సదుపాయాలు లేవని వంశీ న్యాయవాది కోర్టుకు వివరించగా, దీనిపై ప్రభుత్వ న్యాయవాదిని వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. పోలీసు కస్టడీలో ఉన్న సమయంలో వంశీ ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు. శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో, హుటాహుటిన వైద్యసాయం అందించాల్సి వచ్చింది. వంశీ బాగా నీరసించిన స్థితిలో ఉండగా, నోటికి రుమాలు అడ్డుగా పెట్టుకుని దగ్గుతున్నట్లు కనిపించారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత 100 రోజులుగా వంశీ రిమాండ్లో ఉంటున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి, నాయకుడు సత్యవర్థన్పై దాడి, కిడ్నాప్, భూ కబ్జా కేసులతో పాటు, తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కూడా వంశీపై విచారణ కొనసాగుతోంది. విచారణల మధ్యలో ఒక్కసారిగా ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, కోర్టు వైద్య పరిరక్షణకు కీలకమైన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబం, శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రైవేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించేందుకు హైకోర్టు తీర్పు కాస్త మనశాంతి ఇస్తోంది.