Sify Data Centre: విశాఖ తీరం ఇప్పుడు కేవలం అందమైన బీచ్లకు, పోర్టుకు మాత్రమే కాదు. అంతర్జాతీయ డిజిటల్ ప్రపంచానికి సరికొత్త గేట్వేగా మారబోతోంది! సుమారు రూ. 1,500 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మకమైన ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎడ్జ్ డేటా సెంటర్కు, ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ (CLS)కు ఆంధ్రప్రదేశ్ ఐటీ,పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ మెగా ప్రాజెక్టు రాష్ట్ర టెక్నాలజీ రంగంలో ఒక కీలక ముందడుగుగా నిలుస్తోంది.
నాస్డాక్లో నమోదైన ప్రముఖ డిజిటల్ ఐసీటీ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. రెండు దశల్లో సుమారు రూ. 1,500 కోట్ల పెట్టుబడితో 50 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ఏఐ-ఆధారిత డేటా సెంటర్ను సిఫీ అభివృద్ధి చేయనుంది.
ఈ ప్రాజెక్టు విశాఖపట్నం రూపురేఖలను మార్చనుంది. కేవలం డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ను ఏర్పాటు చేయడం వలన, విశాఖపట్నం భారతదేశానికి తదుపరి గ్లోబల్ డిజిటల్ గేట్వేగా మారనుంది. ఈ అత్యాధునిక సీఎల్ఎస్ (CLS) ద్వారా భారతదేశంతో పాటు సింగపూర్, మలేషియా, ఆస్ట్రేలియా వంటి ఆగ్నేయాసియా దేశాల మధ్య డేటా ప్రసారం వేగంగా, సమర్థవంతంగా జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం టెక్నాలజీ ఆధారిత అభివృద్ధిపై దృష్టి సారించడంలో భాగంగా చేపట్టిన ఈ చొరవతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. సిఫీ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ డేటా సెంటర్ కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.
విశాఖను దేశంలోనే ప్రముఖ ఐటీ, డేటా హబ్గా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి సిఫీ ప్రాజెక్టు ఒక బలమైన పునాదిగా నిలవడంతో పాటు, ఏపీలో డిజిటల్ మౌలిక సదుపాయాలను గణనీయంగా బలోపేతం చేయనుంది.


