మాజీ మంత్రి వివేకానంద రెడ్డి(Viveka) హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న వాచ్మెన్ రంగన్న(70) మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసులో రంగన్న కీలక సాక్షి కావడంతో దర్యాప్తును సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసు విచారణాధికారిగా సీఐ ఉలసయ్యను ఉన్నతాధికారులు నియమించారు.
కాగా కొంతకాలంగా ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రంగన్న రెండు వారాల కిందట కిందపడ్డారు. కాలికి గాయం కావడంతో అప్పటి నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఊపిరాడటం లేదని తెలపడంతో కుటుంబ సభ్యులు, రక్షణగా ఉన్న కానిస్టేబుల్ కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే వివేకా హత్య కేసులో కీలక సాక్షి కావడంతో ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు ఆయన భార్య ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.