Saturday, November 15, 2025
HomeTop StoriesHeavy Rains: రాష్ట్రానికి వాయుగుండం ముప్పు.. అతి భారీ వర్షాలకు అవకాశం!

Heavy Rains: రాష్ట్రానికి వాయుగుండం ముప్పు.. అతి భారీ వర్షాలకు అవకాశం!

Weather Forecast: ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్‌’, మరికొన్ని జిల్లాలకు ‘ఎల్లో’ ఎలర్ట్‌లను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మంగళవారం తెల్లవారుజామున తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బుధవారం ఉదయానికి ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంలో వాయుగుండంగా బలపడుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. తదనంతరం.. 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

- Advertisement -

రాష్ట్రంలో 5 రోజుల పాటు పిడుగులతో వర్షాలు: రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తుల నిర్వహణ సంస్థలు అంచనా వేశాయి. బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/heavy-rain-alert-in-ap-for-5-days/

మత్స్యకారులకు హెచ్చరిక: తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. సముద్రం అలజడిగా మారనుందని అంచనా వేస్తున్నారు. కావున మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.

అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల నిర్వహణ సంస్థ ప్రభావిత జిల్లాల యంత్రాంగాలను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ తెలిపారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు సంస్థలోని కంట్రోల్‌రూం నంబర్లు 112, 1070, 18004250101 లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

పిడుగుల హెచ్చరిక: ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad