రాష్ట్రంలో ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని.. ఆరోపిస్తూ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా వెన్నుపోటు దినం గా నిరసనలు నిర్వహించింది. ఈ సందర్భంగా పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు “షూరిటీ అంటే భవిష్యత్తు గ్యారంటీ” అని చెప్పారని, కానీ ప్రజలకు ఇప్పుడు “షూరిటీ అంటే మోసం గ్యారంటీ”గా అనిపిస్తోందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో మూడు లక్షల కోట్లు మాత్రమే అప్పు చేశామని, అయితే కూటమి ప్రభుత్వం కేవలం ఏడాదిలోనే రూ. 55 వేల కోట్ల అప్పు చేసినట్టు ఆరోపించారు.
ఇంత భారీ అప్పు చేసినప్పటికీ, ప్రజలకు ఒక్క పథకాన్ని కూడా అందించలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఉచిత బస్సు సేవలు, రైతులకు రూ. 20 వేలు వార్షిక సాయం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్య పథకాలు అన్నీ నిర్వీర్యం చేయబడ్డాయని మండిపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి కేటాయించిన 50 ఎంబీబీఎస్ సీట్లను వెనక్కి పంపించారని ధ్వజమెత్తారు.
జగన్ ప్రభుత్వం హయాంలో పులివెందులలో చేపట్టిన అభివృద్ధి పనులలో 90 శాతం పూర్తయ్యాయని, అయితే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఒక్క 10 శాతం పనులను కూడా ముందుకు తీసుకెళ్లలేకపోయిందని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని మోసం చేసిన ఈ పాలనను ప్రజలు త్వరలోనే తగిన శాస్తి చేస్తారని అవినాశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.