Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Jagan Mohan Reddy: చంద్రబాబుపై జగన్ వ్యంగ్యాస్త్రాలు.. అక్కాచెల్లెమ్మలను దగా చేశారంటూ ధ్వజం

Jagan Mohan Reddy: చంద్రబాబుపై జగన్ వ్యంగ్యాస్త్రాలు.. అక్కాచెల్లెమ్మలను దగా చేశారంటూ ధ్వజం

- Advertisement -

Jagan Hot Comments On Chandrababu: నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన ఆరోపించారు.మీ మోసాలతో అక్క చెల్లెమ్మలకూ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు.

మహిళా సంక్షేమ పథకాలపై విమర్శలు

టీడీపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంపై జగన్ మోహన్ రెడ్డి ప్రధానంగా ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు “సూపర్-6, సూపర్-7” పథకాలతో ప్రజలను నమ్మించి, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పూర్తిగా అమలు చేయడం లేదని ఆయన అన్నారు.

ఉచిత బస్సు ప్రయాణంలో పరిమితులు: ఆర్టీసీ బస్సులలో 16 కేటగిరీలు ఉంటే, కేవలం 5 కేటగిరీల బస్సులలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం మోసం అని జగన్ అన్నారు. మొత్తం 11,256 బస్సులలో కేవలం 6,700 బస్సులలో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంచడం, ఇంకా కొన్ని బస్సులకు ఈ పథకం వర్తించదని బోర్డులు పెట్టడం మహిళలను దగా చేయడమేనని విమర్శించారు.

గ్యాస్ సిలిండర్ల పథకంపై విమర్శలు: చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇచ్చిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కూడా అఘోరించింది అని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో 1.59 కోట్ల కనెక్షన్లకు మూడు సిలిండర్లు ఇవ్వడానికి రూ. 4,100 కోట్లు అవసరమైతే, మొదటి ఏడాది కేవలం రూ. 764 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, ఒకే సిలిండర్ ఇచ్చారని, అది కూడా అందరికీ అందలేదని జగన్ పేర్కొన్నారు. రెండో ఏడాది కూడా ఇదే పరిస్థితి పునరావృతం అవుతోందని అన్నారు.

వైసీపీ పాలనతో పోలిక

జగన్ తన పాలనలో మహిళల కోసం చేపట్టిన పథకాలను గుర్తు చేసుకున్నారు. తన ప్రభుత్వం మహిళా సాధికారతకు ఒక స్వర్ణయుగాన్ని సృష్టించిందని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది ఒక గొప్ప అధ్యాయమని ఆయన అన్నారు.

అమ్మ ఒడి, చేయూత, ఆసరా: జగన్ పాలనలో ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం కింద ప్రతి ఏడాది రూ. 15,000 ఇచ్చామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం దానిని రద్దు చేసిందని ఆరోపించారు. చేయూత కింద 33 లక్షల మంది మహిళలకు రూ. 19,189 కోట్లు, ఆసరా కింద రూ. 25,571 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేశామని తెలిపారు.

కాపు నేస్తం, ఈబీసీ నేస్తం: కాపు నేస్తం కింద 4.62 లక్షల మంది కాపు మహిళలకు రూ. 2,029 కోట్లు, ఈబీసీ నేస్తం కింద 4.95 లక్షల మందికి రూ. 1,876 కోట్లు అందజేశామని వివరించారు.

సున్నా వడ్డీ, ఇళ్ల పట్టాలు: 1.05 కోట్ల మంది మహిళలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేసి, రూ. 4,969 కోట్లు చెల్లించామని, అలాగే 31 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీదనే రిజిస్టర్ చేశామని జగన్ గుర్తు చేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం తన సంక్షేమ పథకాలను రద్దు చేసి, మహిళలను మళ్లీ పేదరికంలోకి నెట్టిందని జగన్ ఆరోపించారు. “చంద్రబాబు ష్యూరిటీ… మోసం గ్యారంటీ” అంటూ దుయ్యబట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad