ys sharmila fire on Chandrababu: కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు. ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండానే ‘సూపర్ హిట్’ అని ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ‘సూపర్ సిక్స్’ ప్రచారం కేవలం ప్రజలను నవ్వించే చర్య మాత్రమేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
ఒక్కరికైనా భృతి అందిందా?: ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగుల్లో ఒక్కరికైనా రూ. 3,000 భృతి వచ్చిందా అని ప్రశ్నించారు. 20 లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని వైఎస్ షర్మిల నిలదీశారు. పరిశ్రమలు స్థాపించకుండానే ఒప్పంద పత్రాలు చూపి ఉద్యోగాలు సృష్టించామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు ఇవ్వకుండానే సూపర్ సిక్స్ ఎలా విజయవంతమైందని ఆమె ప్రశ్నించారు.
పథకాల్లో కోత పెట్టడం సరికాదు: రైతుల విషయంలోనూ కూటమి ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తోందని వైఎస్ షర్మిల తన ఆవేదనను వెల్లడించారు. కేంద్రం ఇచ్చే రూ. 6,000కు అదనంగా ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కేవలం 44 లక్షల మంది రైతులకే రూ. 7,000 అందిస్తున్నారని మండిపడ్డారు. దాదాపు 30 లక్షల మందికి కోత పెట్టడమేంటని ప్రశ్నించారు. పథకాల్లో కోత పెట్టడం సరికాదని అన్నారు.
ప్రచారం కొండంత.. చేసేది గోరంత: మహిళలను సైతం మోసం చేశారని అన్నారు. ప్రతి నెలా మహిళలకు రూ. 1,500 ఇస్తామన్న హామీని గాలికొదిలేశారని అన్నారు. ‘తల్లికి వందనం’ పథకంలో సైతం 87 లక్షల మంది విద్యార్థులకు గాను 20 లక్షల మంది లబ్ధిదారులని దూరం చేశారని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసంచేసిందని వైఎస్ షర్మిల అన్నారు. గోరంత చేసి కొండంత ప్రచారం చేసుకోవడం కూటమి ప్రభుత్వానికే చెల్లిందని వైఎస్ షర్మిల విమర్శించారు. ఇప్పటికైనా హామీల అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టాలని కోరారు.
నేడే సూపర్ సిక్స్ జయభేరి: రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ హామీల విజయోత్సవ సభను.. బుధవారం అనంతపురంలో జరపనున్నారు. ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరుతో నిర్వహించే ఈ సభకు కూటమిలోని మూడు పార్టీల నాయకులు, మంత్రులు సహా ఇతర నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకానున్నారు. ఈ సభకు 50 ఎకరాల విస్తీర్ణంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు కూటమి నేతలు తెలిపారు. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, ఆయా పార్టీల అభిమానులు సభకు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పది మందికి పైగా మంత్రులు, 90 మంది ఎమ్మెల్యేలు అనంతపురం చేరుకున్నారు. దీంతో వేలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.


