YS Viveka murder case Supreme Court: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. సీబీఐ తన వాదనలు వినిపించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు జరపాలని పిటిషనర్ కోరుతున్నారని, అందుకు కోర్టు తగిన ఆదేశాలు ఇస్తే దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ వైఎస్ సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తు విషయంలో ట్రయల్ కోర్టులో మరో పిటిషన్ వేయాలని సునీతకు సూచించింది. రెండు వారాల్లో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతించింది. పిటిషన్ వేసిన 8 వారాల్లో మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ప్రకటించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ట్రయల్ కోర్టు నిర్ణయం వచ్చేంత వరకు నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణలను వాయిదా వేసింది. నిందితుల బెయిల్ రద్దు అంశంలో ఇప్పుడు జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుల బెయిల్ రద్దుతో పాటు దర్యాప్తును కొనసాగించడానికి ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని పిటిషనర్ వైఎస్ సునీతకు సూచించింది. దీంతో, నిందితులకు కాస్త ఊరట లభించింది. అయితే, మరింత సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని వైఎస్ సునీత తరపు లాయర్ కోరగా… సీబీఐ ఇప్పటికే చార్జ్షీట్ దాఖలు చేసినట్లు గుర్తు చేసింది.
Read Also: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/case-file-on-ram-gopal-varma/
కేసు దర్యాప్తుకు మేం సిద్ధమన్న సీబీఐ..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటివరకు మొత్తం 8 మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగి రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్జి, వి. రాజశేఖర్ రెడ్డిలను అరెస్టు చేశారు. వీరంతా బెయిల్ పై బయటకు వచ్చారు. అవినాష్ రెడ్డి మినహా అందరూ జైల్లో కొంత కాలం గడిపిన తర్వాత బెయిల్ వచ్చింది. అయితే, అవినాష్ రెడ్డికి మాత్రం అరెస్టు చేసిన విషయం కూడా తెలియకుండానే బెయిల్ వచ్చేసింది. అయితే, అప్పటి నుంచి నిందితుల బెయిల్ రద్దు చేయాలని వైఎస్ నునీత రెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. ఇదే విషయంపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే, సుదీర్గ కాలం పెండింగ్లో ఉన్న ఆ పిటిషన్ మంగళవారం విచారణకు రాగా… సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది. కాగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు అయిన వివేకానందరెడ్డి 2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని ఆయన నివాసంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఆయన మొదట రక్తపు వాంతాలతో, గుండెపోటుతో చనిపోయారని ప్రచారం జరిగింది. అయితే, పోస్టుమార్టం చేయించగా హత్యగా తేలింది. ఇంట్లో సాక్ష్యాలను తుడిచి పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు పోస్టు మార్టం వద్దని చెప్పడం, గొడ్డలి పోట్లకు కట్లు కట్టేసి ఉండటం వంటి విషయాలను లేవనెత్తుతూ సీబీఐ విచారణకు వివేకా కుమార్తె డిమాండ్ చేసి కోర్టుకెళ్లారు. అప్పటి నుంచి కోర్టులో విచారణ జరుగుతోంది.


