Minister Parthasarathi: ఏపీ మంత్రి పార్థసారథి తాజాగా చేసిన వ్యాఖ్యల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు చేపడుతున్న తక్కువ స్థాయి రాజకీయాలు తనను తీవ్రంగా బాధించాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు హుందాతనంతో సాగాలని, విధ్వంసకర ధోరణిలో వ్యవహరించడం సరైన పద్ధతి కాదని సూచించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ వ్యాఖ్యలలో అసహనం స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు.
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో రాజకీయాలు చేయదని, ప్రస్తుతం రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన కొనసాగుతుందని పార్థసారథి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ అవమానకరంగా మాట్లాడుతూ అసహ్యతకరంగా ఆనందపడుతున్న తీరును మంత్రి తీవ్రంగా విమర్శించారు.
తప్పులు చేసిన వైసీపీ నేతలపై చట్టపరమైన చర్యలు తప్పవని, దానికి కక్ష సాధింపు అనే ముద్ర వేయడం తగదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పరిపాలన రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని, అయినప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఆలోచించి పనిచేస్తోందని తెలిపారు. వైసీపీ నిజంగా ఒక బాధ్యతగల రాజకీయ పార్టీగా వ్యవహరిస్తోందా అనే అంశాన్ని జగన్ ఆలోచించాలని సూచించారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టే రీతిలో మాట్లాడటం రాష్ట్ర ప్రజలతో అన్యాయం చేస్తుందన్నారు. ఇలాంటి వ్యాఖ్యలకు పార్టీ తరఫున ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


