Nara Lokesh on Employment: రాష్ట్రంలోని యువతకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలోని యువతకు విదేశాల్లో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్న లోకేష్.. ఓవర్సీస్ మ్యాన్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఓంక్యాప్) ద్వారా రాబోయే ఐదేళ్లలో లక్ష బ్లూకాలర్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. అదే విధంగా వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులతో మీటింగ్ అనంతరం విద్యాశాఖపై మంత్రి లోకేశ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విదేశాల్లో ఏపీ యువతకు ఉద్యోగాల కల్పనకు అనుగుణంగా పక్కా ప్రణాళికతో కూడిన రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు.
విదేశాల్లో ఉద్యోగాలు
‘నర్సింగ్, వెల్డర్స్, ట్రక్కర్స్, బిల్డింగ్ వర్కర్లకు యూరప్తో పాటు జర్మనీ, జర్మనీ, ఇటలీల్లో మంచి డిమాండ్ ఉంది. నర్సింగ్, ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యనభ్యసించిన యువతీయువకులకు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చి, విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి కేరళ మోడల్ను అధ్యయనం చేయాలి. యూరప్ జీసీసీలలో డిమాండ్ ఉన్న ఉద్యోగాలపై దృష్టి సారించి, అందుకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలి’. అని సమీక్షలో లోకేశ్ మాట్లాడారు.
నర్సింగ్ శిక్షణ
కాగా, ప్రస్తుతం ఓంక్యాప్ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,774 మంది నర్సింగ్ అభ్యర్థులు విదేశీభాషల్లో శిక్షణ పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు. నైపుణ్యం పోర్టల్పైనా సమీక్ష నిర్వహించిన లోకేశ్.. ఇందులో 23 విభాగాల డాటా బేస్ను ఇంటిగ్రేట్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 4,639 భారీ, మధ్యతరహా పరిశ్రమలతో సంబంధించి వారికి అవసరమైన విధంగా వర్క్ ఫోర్స్ను సిద్ధం చేయాలని సూచించారు. వచ్చేనెలలో పోర్టల్ ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని యువతకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/31-all-india-services-officers-transfer/
ఇంకా రాష్ట్రంలోని 83 ప్రభుత్వ ఐటీఐలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. కాగా, ఐటీఐలల్లో ప్రస్తుతం అడ్మిషన్లు పెరిగాయని, అయితే సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్రంలో 87 పాలిటెక్నిక్లకు సంబంధించి 646 టీచింగ్, 2183 నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మానవవనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, స్కిల్ డెవలప్ కార్పొరేషన్ సీఈవో గణేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి యేటా డీఎస్సీ..
సమావేశం అనంతరం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేశ్.. వచ్చే ఏడాది జనవరిలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. అదే ఏడాది మార్చిలో పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది నవంబర్లో టెట్ ఉంటుందన్న మంత్రి.. అభ్యర్థులు అందుకు అనుగుణంగా సన్నద్ధత కావాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం ఇక ప్రతి యేటా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విద్యా విధానంపై అధ్యయనం చేసేందుకు 78 మంది ఉత్తమ టీచర్లను ఎంపిక చేసి సింగపూర్కు పంపిస్తామని వివరించారు.


