Vice-Presidential Election: ఢిల్లీ కేంద్రంగా ఏపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. త్వరలో జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ను అభ్యర్థిగా ఖరారు చేసింది. ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్కు ఫోన్ చేసి మద్దతు కోరడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పటికీ, కేంద్రంలోని బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మద్దతు కోరడం వ్యూహాత్మకంగా కనిపిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్లో ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, ఏకగ్రీవంగా గెలవడానికి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అభ్యర్థనపై జగన్ పార్టీలో చర్చించి నిర్ణయం చెబుతానని చెప్పినట్లు సమాచారం.
GST Relief: జీఎస్టీ మార్పులతో మధ్యతరగతికే లాభం.. గృహోపకరణాల నుంచి సిమెంట్ వరకు రేట్ల తగ్గింపు!
జగన్ వైఖరిపై విశ్లేషకులు వివిధ కోణాల్లో ఆలోచిస్తున్నారు. 2024 ఎన్నికల వరకు జగన్ పలు సందర్భాల్లో ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. కానీ, ఎన్నికల్లో బీజేపీ, టీడీపీతో జతకట్టడంతో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ, కాంగ్రెస్ పట్ల ఆయన మొదటి నుంచి వ్యతిరేకత చూపుతున్నారు. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ ఏపీ విషయంలో మాట్లాడకపోవడంపై జగన్ మండిపడిన నేపథ్యంలో, ఆయన ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు.
రాజ్ నాథ్ సింగ్ నేరుగా ఫోన్ చేసి మద్దతు కోరడంతో, జగన్ సానుకూలంగానే స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఎన్నికలో వైసీపీ మద్దతు ఎన్డీఏ వైపే ఉంటుందని భావిస్తున్నారు. ఇది జరిగితే, ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఎన్డీఏ వైపే ఉన్నట్లు మరోసారి స్పష్టం అవుతుంది. ఈ పరిణామాలు 2029 ఎన్నికల వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ఏపీ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.


