Viral Video: ఆంధ్రప్రదేశ్ లో ర్యాగింగ్ భూతం మళ్లీ కలకలం రేపుతోంది. ఇప్పటికే హాస్టళ్లలో ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను చితకబాదిన ఘటనలు వెలుగుచూడగా.. ఇప్పుడు అలాంటిదే మరో వీడియో ఒకటి బయటకొచ్చింది. ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు చితకబాదుతున్న వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు చుట్టూ చేరి చితకబాదారు. మోకాళ్ల మీద నిల్చోబెట్టి మరీ దాడికి దిగారు. క్షమించమని అడిగినప్పటికీ కనికరించకుండా ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. పదే పదే కొట్టడమే కాకుండా కింద పడేసి కాలితో తన్నుతూ రెచ్చిపోయారు. ఓ విద్యార్థి ఆపమని చెప్పినా వినకుండా మరింత దుర్మార్గంగా వ్యవహరించాడు. ఈ తతంగమంతా కూడా అక్కడే ఉన్న మరో విద్యార్థి తన మొబైల్లో రికార్డు చేశారు. ఈ దృశ్యాలు ఇప్పుడు బయటకు రావడంతో సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also: Rithu Chaudhary: బొచ్చు కత్తిరించుకున్న రీతూ.. అడ్డడ్డే.. ఢమాల్ పవన్ ఎంత ఫీలయ్యాడో చూడండి
కాగా, ఈ వీడియోలో ఉన్నది తిరుపతి జిల్లా నారాయణవనంలోని సిద్ధార్థ కాలేజీ హాస్టల్లో జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే, ఆ కాలేజీలో చదువుతున్న ఓ మైనర్ యువతి ప్రేమ వ్యవహారం విద్యార్థుల మధ్య గొడవకు కారణమైంది. వారి మధ్య గొడవ తీవ్రం కావడంతో.. ఐదుగురు విద్యార్థులు ఓ విద్యార్థిని హాస్టల్ గదిలోకి తీసుకొచ్చి చితకబాదారు. విద్యార్థిపై కాళ్లతో తంతూ చిత్ర హింసలకు గురిచేశారు. తనను కొట్టొద్దు అంటూ విద్యార్థి వేడుకున్నా.. తోటి విద్యార్థులు రౌడీల్లా అతనిపై దారుణంగా దాడిచేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో కళాశాల యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. కాగా.. ఈ ఘటనకు కారకులైన కడపకు చెందిన ఆరుగురు పాలిటెక్నిక్ విద్యార్థులపై నారాయణవనం పీఎస్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. అంతేకాక కళాశాల నుండి వారిని సస్పెండ్ చేశారు. వీరితోపాటు వారి మధ్య గొడవకు కారణమైన యువతికిసైతం కళాశాల యాజమాన్యం టీసీ ఇచ్చి పంపేసింది.
Read Also: Bigg Boss Sanjana Galrani: ఇదేం న్యాయం నాగార్జున గారు.. హరీష్ ని బలి చేసేశారుగా..!

