గురువారం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టిటిడి ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు భక్తులకు వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ముఖ్యమంత్రి అంగీకారంతో నేడు ప్రారంభం
అనంతరం చైర్మన్ బీ.ఆర్.నాయుడు మాట్లాడుతూ, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఇవాళ నుండి ప్రారంభించామన్నారు.
ప్రతి రోజు వడ పంపిణీ
ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు తెలిపారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శెనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పొదీన, సోంపును ఉపయోగించినట్లు తెలిపారు.
ఉదయం, సాయంత్రం 35 వేల వడలు
తిరుమల తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఇకపై ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు 35 వేల వడలను భక్తులకు వడ్డిస్తామన్నారు.
భవిష్యత్తుల్లో మరింతమందికి
భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి భక్తులకు రుచికరమైన భోజనం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు శాంతా రామ్, డిప్యూటీ ఈవోలు లోకనాథం, రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.