Bigg Boss Season 9:బిగ్బాస్ సీజన్లో రెండవ వారం మొదలైనప్పటి నుంచే హౌస్లో చిన్నపాటి గొడవలు, భావోద్వేగాల క్షణాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్సీ రేసు కోసం జరుగుతున్న టాస్క్లు కంటెస్టెంట్స్ మధ్య పోటీని మరింత వేడెక్కించాయి. ఈ వారం కొత్త కెప్టెన్ కోసం బిగ్బాస్ ప్రత్యేకమైన టాస్క్లు పెట్టి, ఆటను మరింత ఆసక్తికరంగా మార్చాడు.
ఓనర్స్-టెనెంట్స్ ఫార్మాట్లో…
కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ను ఓనర్స్-టెనెంట్స్ ఫార్మాట్లో ప్రారంభించారు. ఇందులో సెలబ్రిటీలు ఓనర్స్గా, సాధారణ కంటెస్టెంట్స్ టెనెంట్స్గా పాల్గొన్నారు. ఈ టాస్క్కు సంచలక్గా రీతూ చౌదరిని బిగ్బాస్ ఎంపిక చేశాడు. టైమర్ టాస్క్తో మొదలైన ఈ రౌండ్లో వ్యూహాలు, వాదనలు, ఎమోషనల్ రియాక్షన్లు అన్నీ కలిసిపోవడంతో హౌస్ వాతావరణం హై వోల్టేజ్గా మారింది.
ఓనర్స్లో నలుగురిని
ఈ టాస్క్లో భాగంగా బిగ్బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్సీ రేసులో ఉన్న ఓనర్స్లో నలుగురిని తప్పించాలని ఆయన చెప్పాడు. దాంతో హౌస్లోని వారంతా కలసి చర్చించి, ఓటింగ్ పద్ధతిని అనుసరించారు. ఎక్కువమంది డీమాన్ పవన్ కెప్టెన్సీకి సరిపోడని ఓటేశారు. అయితే ఇక్కడ రీతూ చౌదరి జోక్యం చేసుకుంది. ప్రియ, శ్రీజ కంటే పవన్ బెటర్ కెప్టెన్ అవుతాడని ఆమె అభిప్రాయం చెప్పడంతో సన్నివేశం మారిపోయింది. దాంతో పవన్ మళ్లీ రేసులోకి వచ్చాడు. చివరికి ప్రియ, శ్రీజ, హరీష్, పవన్ కళ్యాణ్ నలుగురిని రేసు నుంచి తప్పించినట్లు సంజన ప్రకటించింది. దీనిపై ప్రియ, శ్రీజ గట్టిగా వాదించగా, రీతూ కూడా వారిని ఎదిరించింది.
ఏకగ్రీవంగా ఇమ్మాన్యుయేల్
ఈ దశలో కెప్టెన్సీ రేసులో భరణి, మర్యాద మనీష్, డీమాన్ పవన్ ఉన్నారు. వీరికి తోడుగా బిగ్బాస్ మరో అవకాశం ఇచ్చి, ఇమ్మాన్యుయేల్ను కూడా కంటెండర్గా ఎంచుకునే అవకాశం కల్పించాడు. అందరూ ఏకగ్రీవంగా ఇమ్మాన్యుయేల్ పేరును చెప్పడంతో అతను రేసులోకి వచ్చాడు.
రంగు పడుద్ది
అలా ఫైనల్ రేసులో నాలుగుగురు — భరణి, మనీష్, డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ పోటీపడ్డారు. వీరి కోసం బిగ్బాస్ రంగు పడుద్ది అనే టాస్క్ని ఏర్పాటు చేశాడు. ఇందులో ప్రతి ఒక్కరు తమ టీషర్ట్పై రంగు పడకుండా కాపాడుకోవాలి. రౌండ్ చివరికి ఎవరి టీషర్ట్ ఎక్కువ రంగుతో ఉంటే వారు ఆట నుండి అవుట్ అవ్వాలి.
మొదటి రౌండ్లో మనీష్, భరణిని టార్గెట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే భరణి, ఇమ్మాన్యుయేల్ కలసి మనీష్పై ఎక్కువ రంగు పూశారు. డీమాన్ పవన్ మాత్రం ఈ ఫైట్కి దూరంగా ఉండిపోయాడు. దీంతో మొదటి రౌండ్లో మనీష్ ఎలిమినేట్ అయ్యాడు.
రెండో రౌండ్లో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. భరణి, ఇమ్మాన్యుయేల్ కలసి పవన్పై దాడి చేశారు. ఈ దశలో సంచలక్ రీతూ చౌదరి నిర్ణయాలు వివాదానికి దారితీశాయి. బజర్ మోగే ముందు పవన్ టీషర్ట్ ఎక్కువగా రంగుతో నిండిపోయింది. అయినప్పటికీ రీతూ ఆయనను కాపాడుతూ, భరణినే తప్పించిందని చెప్పింది. దీని వల్ల ఓనర్స్ బృందం ఆమెను మెచ్చుకోగా, భరణి మాత్రం ఎలాంటి వాదన చేయకుండా నిశ్శబ్దంగా బయటికి వెళ్లిపోయాడు.
రూల్స్ ఉల్లంఘన
చివరి రౌండ్లో డీమాన్ పవన్, ఇమ్మాన్యుయేల్ మధ్య గట్టి పోటీ జరిగింది. రూల్స్ ప్రకారం టీషర్ట్ లాగకూడదు, రంగు దూరం నుంచి విసరకూడదు, దగ్గరికి వెళ్లి మాత్రమే పూయాలి అని స్పష్టంగా చెప్పారు. కానీ పవన్ ఇమ్మాన్యుయేల్ టీషర్ట్ లాగి రంగు పూశాడు. దీనిని రూల్స్ ఉల్లంఘనగా కొందరు ప్రశ్నించినా, రీతూ పవన్కు మద్దతు ఇస్తూ, ఇమ్మాన్యుయేల్పైనే సీరియస్గా మాట్లాడింది.
ఈ నిర్ణయంపై ఇమ్మాన్యుయేల్ నిరాశ వ్యక్తం చేసినప్పటికీ, అతను చివరి వరకు పవన్తో గట్టి పోటీ ఇచ్చాడు. తన శక్తి తగ్గిపోతున్నా, మధ్యలో వదిలేయకుండా ఎక్కువ సేపు పోరాడాడు. చివరికి తక్కువ తేడాతో పవన్ విజయం సాధించాడు.


