Friday, June 13, 2025
Homeట్రేడింగ్UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల్లేవ్.. కేంద్రం ప్రకటన

UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీల్లేవ్.. కేంద్రం ప్రకటన


UPI Payments: కొవిడ్ -19 కారణంగా దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. ఎంతగా అంటే.. చిన్న షాపులో టీ తాగినా, ఇంట్లో సరుకులు తెచ్చుకున్నా “భయ్యా” ఫోన్‌పే ఉందా..? అని అడగడం క్షణాల్లో క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి డబ్బు పంపేస్తున్నాం. ఈ గూగుల్‌పేలు, ఫోన్‌పేలు వచ్చాక చిల్లర సమస్యతో పాటుగా దొంగలు డబ్బులు కొట్టేస్తారన్న భయం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అకౌంట్లోంచి నేరుగా ఖర్చు పెట్టేయొచ్చు.

ఈ నేపథ్యంలో యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు కేంద్రం యోచిస్తుందనే వార్తలు వచ్చాయి. రోజుకు రూ. 3,000 కన్నా ఎక్కువ లావాదేవీలపై ‘మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌’ (MDR) ఛార్జీ వసూలు చేయడానికి సిద్ధమైందని ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని స్పష్టం చేసింది. దీంతో యూపీఐ వినియోగదారులకు ఊరట లభించింది.

యూపీఐ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా యూపీఐ యాప్‌ల ద్వారా బ్యాలెన్స్ చెక్ సదుపాయంపై పరిమితులు విధించాలని నిర్ణయించింది. యూపీఐ వ్యవస్థపై అధిక ఒత్తిడిని తగ్గించడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

2020లో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ‘జీరో ఎండీఆర్’ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు. దీని వల్ల డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. ప్రస్తుతం భారతదేశంలో జరిగే మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు 80 శాతం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. 2020 నుంచి ఇప్పటివరకు యూపీఐ లావాదేవీల విలువ రూ.60 లక్షల కోట్లకు చేరింది.

క్రెడిట్, డెబిట్ కార్డులు, యూపీఐ వంటి వ్యవస్థల ద్వారా పేమెంట్లు అందుకునే వ్యాపారుల నుంచి బ్యాంకులు లేదా పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేసే విధానాన్ని మర్చంట్ డిస్కౌంట్ రేట్‌గా పిలుస్తారు. ట్రాన్సాక్షన్లు సురక్షితగా, వేగంగా పూర్తి చేసేందుకు ఈ ఛార్జీలు ఉపయోగపడతాయి. ఉదాహరణకు ఓ వ్యాపారి రూ.10 వేలు యూపీఐ ద్వారా అందుకుంటే ఎండీఆర్ 0.3 శాతం అంటే రూ.30 ఫీజు వర్తిస్తుంది. వ్యాపారికి రూ.9,970 వెళ్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News