ప్రతి సంవత్సరం కొత్త ఆర్థిక ఏడాది సమయంలో బ్యాంకింగ్ రూల్స్(New Banking Rules) మారుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా కొన్ని నిబంధనల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సేవింగ్స్ అకౌంట్లు, ఏటీఎం లావాదేవీలు, క్రెడిట్ కార్డులు, ఇతర బ్యాంకింగ్ సర్వీసుల నిబంధనల్లో ప్రముఖ బ్యాంకులు మార్పులు తీసుకొచ్చాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, పీఎన్బీ, కెనరా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు కస్టమర్లకు మరింత మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులకు శ్రీకారం చుట్టాయి.
ఏటీఎం విత్డ్రాయల్ ఛార్జీలు: ఏప్రిల్ 1 నుండి ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద ఉచిత లావాదేవీల సంఖ్య తగ్గించాయి. ఇతర బ్యాంకుల ఏటీఎంలను ఉపయోగించినప్పుడు మూడు ఉచిత లావాదేవీలు మాత్రమే చేయగలరు. ఆ తర్వాత ప్రతి అదనపు విత్డ్రాయల్కు రూ. 17లు ఛార్జీ విధించనున్నారు.
మినిమం బ్యాలెన్స్: ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనలను మార్చనున్నట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 1 నుండి గ్రామీణ, పట్టణ, నగరాల కోసం ప్రత్యేకమైన మినిమమ్ బ్యాలెన్స్ నియమాలను అమలు చేయనున్నాయి. ఖాతాదారులు ఈ బ్యాలెన్స్ను నిలుపుకోలేకపోతే జరిమానాకు గురవుతారు.
క్రెడిట్ కార్డు నిబంధనలు: ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తమ కో-బ్రాండెడ్ విస్తారా క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో మార్పులు చేశాయి. క్లబ్ విస్తారా ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డ్, క్లబ్ విస్తారా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కోసం ఇప్పటివరకు అందిస్తున్న టికెట్ వౌచర్ సౌకర్యాన్ని రద్దు చేయనున్నాయి
డిజిటల్ బ్యాంకింగ్: బ్యాంకులు తమ మొబైల్ బ్యాంకింగ్ సేవలను మెరుగుపరచడం, డిజిటల్ లావాదేవీల భద్రతను పెంచడం వంటి చర్యలను చేపట్టాయి. ఇందులో ముఖ్యంగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (Two-Factor Authentication) మరింత పటిష్టంగా చేయనున్నాయి.
పాజిటివ్ పే సిస్టమ్: వ్యాపార లావాదేవీలు మరింత సురక్షితంగా, పారదర్శకంగా ఉండేందుకు పాజిటివ్ పే సిస్టమ్ ప్రవేశపెట్టాయి. ఈ కొత్త విధానం ప్రకారం రూ. 5000 పైగా చెల్లింపుల కోసం చెక్ ఇచ్చే కస్టమర్లు ముందుగా తమ చెక్ వివరాలను ధృవీకరించాల్సి ఉంటుంది.