ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువ అయిపోతున్న సంగతి తెలిసిందే. బ్యాంకు అధికారులమంటూ ఫేక్ నంబర్లు నుంచి ఫోన్లు చేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) అప్రమత్తమైంది. కోట్లాది మందికి దేశంలోని అనేక శాఖల ద్వారా సేవలు అందిస్తోంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తూ వస్తోంది.
సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారుల భద్రత కోసం కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎస్బీఐ నుండి వచ్చే అధికారిక కాల్స్ అన్నీ +91-1600 తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచే వస్తాయని స్పష్టం చేసింది. ఈ నంబర్ల నుండి మీకు కాల్ వస్తే చట్టబద్ధమైన కాల్ అని భావించాలని పేర్కొంది. ఇవి కేవలం బ్యాంకింగ్ లావాదేవీలు, సేవల సంబంధిత సమాచారం కోసం మాత్రమే ఉపయోగించబడతాయని వెల్లడించింది. స్పామ్ లేదా మోసపూరిత కాల్స్ తో వేరుగా గుర్తించడంలో ఈ విధానం ఎంతగానో సహాయపడుతుందని సూచించింది.
ఈ ఏడాది జనవరిలో కస్టమర్ సేవల కోసం 1600 సిరీస్ నంబర్లను ఉపయోగించాలని, ప్రమోషనల్ లేదా మార్కెటింగ్ కాల్స్కు 1400 సిరీస్ ఉపయోగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)అన్ని బ్యాంకుల, ఆర్థిక సంస్థలకు ఆదేశించింది. ఈమేరకు ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది.
