Chinnaswamy Stadium Tragedy: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఒక తండ్రి జీవితాన్ని తలకిందులు చేసింది. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన తన ఏకైక కుమారుడు భూమిక్ సమాధి వద్ద ఆ తండ్రి పడిన ఆవేదన ఇప్పుడు యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. “ఏ తండ్రికి లేదా తల్లికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. నేను ఎక్కడికీ వెళ్లను. నా కుమారుడితో పాటు ఇక్కడే ఉంటా” అంటూ లక్ష్మణ్ చేసిన రోదన.. గుండెల్ని పిండేస్తోంది.
హసన్ జిల్లాలోని కుప్పగోడ్ గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి భూమిక్, తన స్నేహితులతో కలిసి ఆర్సీబీ విజయోత్సవ వేడుకలకు చిన్నస్వామి స్టేడియంకు వెళ్ళాడు. కానీ, అక్కడ పండుగ వాతావరణం విషాదంగా మారింది. టికెట్లు, పాసులు ఉన్నవారికే ప్రవేశం అని చెప్పినా, అభిమానులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, భూమిక్ కూడా వారిలో ఒకడు.
కుమారుడు భూమిక్ మరణవార్త విన్న ఆ తల్లిదండ్రుల గుండె ఎంత తల్లడిల్లిందో చెప్పలేము. మూడో రోజు కర్మ కార్యక్రమాల కోసం సొంత గ్రామం కుప్పగోడ్లో, తన కొడుకు భవిష్యత్తు కోసం దాచుకున్న స్థలంలోనే భూమిక్ సమాధిని ఏర్పాటు చేశారు. అక్కడ, సమాధిపై పడి బోరున విలపించిన లక్ష్మణ్, “ఒక తండ్రి లేదా తల్లికి ఇలాంటి పరిస్థితి ఎప్పటికీ రావద్దు. నేను నా కుమారుడి కోసం ఈ స్థలం ఉంచాను. కానీ, ఇప్పుడు ఇక్కడే నిన్ను సమాధి చేయాల్సి వచ్చింది. నేను నా కుమారుడితో పాటు ఇక్కడే పడుకుంటా” అంటూ పడిన బాధను చూసి అంతా కన్నీరు మున్నీరు అయ్యారు.
డీటీ లక్ష్మణ్-అశ్విని దంపతులకు భూమిక్ ఒక్కడే కుమారుడు. గత 20 సంవత్సరాలుగా బెంగళూరులో చిన్న పరిశ్రమను నిర్వహిస్తూ జీవిస్తున్న ఆ కుటుంబానికి ఈ ఘటన తీరని శోకాన్ని మిగిల్చింది. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత గెలవడంతో భారీ ఎత్తున సంబరాలు చేసుకోవాలని ఫ్రాంచైజీ నిర్ణయించింది. దీనికి సంబంధించి సరైన ప్రణాళిక లేకపోవడం, అనూహ్యంగా వేల సంఖ్యలో అభిమానులు తరలిరావడంతోనే ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.