Helicopter Manufacturing: భారత రక్షణ , వైమానిక రంగంలో మరో సంచలనం నమోదైంది. రేవుల నుంచి రోడ్ల వరకు, విద్యుత్ నుంచి విమానాల వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించిన అదానీ గ్రూప్, ఇప్పుడు నింగిపై గురి పెట్టింది. దేశీయ బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, ఇకపై భారత్లోనే హెలికాప్టర్లను తయారు చేయబోతోంది. భారతదేశాన్ని రక్షణ రంగంలో స్వయం సమృద్ధిగా మార్చే దిశగా అదానీ గ్రూప్ ఒక భారీ అడుగు వేసింది. ఇటలీకి చెందిన ప్రముఖ ఏరోస్పేస్ కంపెనీ లియోనార్డోతో జతకట్టి, దేశంలోనే పూర్తిస్థాయి హెలికాప్టర్ తయారీ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ భాగస్వామ్యం కేవలం విడిభాగాల తయారీకే పరిమితం కాదు. లియోనార్డో కంపెనీకి చెందిన అత్యాధునిక హెలికాప్టర్లు AW169M , AW109 TrekkerM లను ఇకపై భారత్లోనే తయారు చేస్తారు. మన సాయుధ దళాల అవసరాలను తీర్చడమే కాకుండా, పౌర విమానయాన రంగంలోనూ ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.
also read Praneeth Rao: ప్రణీత్రావుకు బిగ్ షాక్.. డీఎస్పీ పదోన్నతి రద్దు.. మళ్లీ ఇన్స్పెక్టర్గానే!
ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా కేవలం తయారీ మాత్రమే కాకుండా మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.హెలికాప్టర్ల నిర్వహణ మరియు మరమ్మతుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన పని లేకుండా స్థానికంగానే సౌకర్యాలు కల్పిస్తారు.అత్యాధునిక హెలికాప్టర్లను నడిపేందుకు పైలట్లకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. దేశీయంగా తయారీ యూనిట్లు రావడం వల్ల వేలాది మంది ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి లభిస్తుంది.
ప్రస్తుతం భారత్లో హెలికాప్టర్ల వాడకం చాలా తక్కువగా ఉంది. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కేవలం 250 హెలికాప్టర్లు మాత్రమే ఉండటం ఆశ్చర్యకరం అని అదానీ డిఫెన్స్ సీఈఓ ఆశీష్ రాజ్వంశీ పేర్కొన్నారు. రాబోయే పదేళ్లలో భారత్కు ఏడాదికి కనీసం 100 హెలికాప్టర్ల అవసరం ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఆ లోటును భర్తీ చేయడమే అదానీ గ్రూప్ లక్ష్యం.
అదానీ గ్రూప్ ఇప్పటికే బ్రెజిల్కు చెందిన ఎంబ్రేయర్ కంపెనీతో విమానాల తయారీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు లియోనార్డోతో చేతులు కలపడం ద్వారా గగనతలంలో అదానీ గ్రూప్ తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు సిద్ధమైంది.

