Ambani has not taken salary for six years: ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన బిలియనీర్, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ వరుసగా ఆరో ఏడాదీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి ఎలాంటి జీతం తీసుకోలేదు. 2020 కోవిడ్ టైమ్లో ఆయన స్వచ్ఛందంగా తన జీతాన్ని వదులుకున్నారు. అదే నిర్ణయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగించారు. రిలయన్స్ తాజా వార్షిక నివేదిక ప్రకారం.. ప్రస్తుతం, ఆయన ఎలాంటి జీతం తీసుకోకపోయినప్పటికీ షేర్లపై లభించే డివిడెండ్లపై ఆదాయం లభిస్తోంది. రిలయన్స్ సంస్థ 2025 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.6 డివిడెండ్ ప్రకటించడంతో, ఆయన పేరుతో ఉన్న 1.61 కోట్ల షేర్ల ద్వారా రూ.9.66 కోట్లు, ప్రమోటర్ గ్రూప్ వాటాల ద్వారా దాదాపు రూ.3,987 కోట్ల డివిడెండ్ ఆదాయం లభిస్తుంది. బడా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ల జీతాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న సమయంలో, అంబానీ జీతాన్ని పూర్తిగా వదులుకోవడం ‘కార్పొరేట్ గవర్నెన్స్’కు నిదర్శనమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also read: Telangana CM: అన్ని పథకాలకు ఒకే డిజిటల్ కార్డు.. తెలంగాణ ప్రభుత్వ వినూత్న ఆలోచన..!
2029 వరకు జీతం తీసుకోవద్దని నిర్ణయం..
అయితే, ముఖేష్ అంబానీ జీతం తీసుకోనప్పటికీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం రికార్డు స్థాయి లాభాలను నమోదు చేసింది. 2025-26లో కంపెనీ రూ.95,754 కోట్ల నికర లాభాలను ఆర్జించడంతో మార్కెట్ క్యాప్ రూ.18.19 లక్షల కోట్లకు చేరుకుంది. గతంలోనూ అంబానీ తన జీతాన్ని తగ్గించుకున్నారు. 2008-09 నుంచి 2019-20 వరకు ముఖేష్ అంబానీ తన వార్షిక ప్యాకేజీని రూ.15 కోట్లకే పరిమితం చేసుకున్నారు. అంబానీ బంధువులు నిఖిల్, హితల్ మెస్వానీలు ఒక్కొక్కరు రూ. 25 కోట్ల చొప్పున అందుకోగా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ జీతం రూ.20.58 కోట్లకు పెరిగింది. అంబానీ వారసులు ఆకాష్, ఈషా మొదట్లో కేవలం సిట్టింగ్ ఫీజు, కమీషన్ మాత్రమే తీసుకోగా.. ఇటీవల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితుడైన అనంత్ అంబానీ రూ.12.17 కోట్ల ప్యాకేజీ అందుకుంటున్నారు. 2029 వరకు రిలయన్స్ చైర్మన్గా కొనసాగనున్న ముఖేష్ అంబానీ, అప్పటివరకు జీతం తీసుకోకూడదని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రపంచ అపర కుబేరుడు జీతం లేకుండా పనిచేయడం ఆసక్తికరంగా మారింది.

