Hyderabad: అత్యాధునిక జర్మన్ సాంకేతికతతో రూపుదిద్దుకున్న తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నగరంలో త్వరలో అందుబాటులోకి రానుంది. నాంపల్లిలో హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రస్తుతం తుది దశ పనుల్లో కొనసాగుతోంది. ట్రయల్స్ ఇప్పటికే ప్రారంభించగా, మిగతా ప్రభుత్వ శాఖల అనుమతులు రాగానే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.
హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ, “నగరంలో పెరుగుతున్న పార్కింగ్ సమస్యలకు ఇది ఒక సమగ్ర పరిష్కారంగా నిలవనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును అత్యంత ఆధునికంగా రూపుదిద్దాం” అని తెలిపారు.
Read more: https://teluguprabha.net/news/huge-discounts-on-these-tata-cars-save-up-to-rs-1-lakh/
ఈ ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రాజెక్ట్ ని హైదరాబాద్ మెట్రో రైల్, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్ లో నిర్మిస్తున్నారు. ‘నోవమ్’ అనే సంస్థ జర్మనీలో అభివృద్ధి చేసిన ఆధునిక ‘పాలిస్’ టెక్నాలజీతో ఈ పార్కింగ్ వ్యవస్థను రూపొందించింది. మొత్తం రూ.102 కోట్ల వ్యయంతో డాక్టర్ హరికిషన్ రెడ్డి, భావనారెడ్డి నేతృత్వంలో ప్రాజెక్టు అభివృద్ధి చేయబడింది. హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ 2000 చదరపు గజాల స్థలాన్ని 50 సంవత్సరాల పాటు లీజుకు ఇచ్చింది.
ఈ కాంప్లెక్స్లో మొత్తం 15 అంతస్తులు ఉండగా, అందులో 10 అంతస్తులు పార్కింగ్ కోసం, 5 అంతస్తులు వాణిజ్య కార్యకలాపాల కోసం వినియోగించనున్నారు. మూడు బేస్మెంట్లతో పాటు 5 నుంచి 11వ అంతస్తుల వరకు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఈ పార్కింగ్ సదుపాయంలో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలను ఉంచే సామర్థ్యం ఉంది. కారుకు గంటకు రూ. 30, ద్విచక్ర వాహనానికి గంటకు రూ. 10 చార్జీగా వసూలు చేయనున్నారు. స్మార్ట్ కార్డుల ద్వారానే చార్జీలు చెల్లించవలసి ఉంటుంది. రెగ్యులర్ వినియోగదారులకు RFID స్మార్ట్ కార్డులను జారీ చేయనున్నారు.
Read more: https://teluguprabha.net/business/royal-enfield-hunter-350-alunched-in-praphite-grey/
ఈ పార్కింగ్ కాంప్లెక్స్లో మూడో అంతస్తులో రెండు స్క్రీన్లతో కూడిన సినిమా థియేటర్, రెస్టారెంట్లు, ఇతర కమర్షియల్ దుకాణాలు ఏర్పాటు చేశారు. అంతేకాక, 11వ అంతస్తులో నగర వీక్షణ గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు ఎంట్రీ మరియు ఎగ్జిట్ టెర్మినల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టెర్మినల్ వద్ద టర్న్టేబుల్లు ఉండే విధంగా డిజైన్ చేశారు. వాహనాన్ని టర్న్టేబుల్పై ఉంచిన తర్వాత, లిఫ్ట్ ద్వారా వాహనాన్ని నిర్ణీత స్థాయికి తీసుకెళ్లి, తగిన స్లాట్లో పార్క్ చేస్తారు. ఈ ప్రక్రియలో కేవలం ఒక్క నిమిషమే పడుతుంది.
పార్కింగ్ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నుమాయిష్ వంటి ప్రాంతాలకు వచ్చే ప్రజలకు పెద్ద ఊరట కలిగించనుంది. ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ వ్యవస్థలలో ఇది దేశంలోనే అగ్రగామిగా నిలవనుంది.


