BSNL Flash Sale: భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి త్వరలోనే 5జీ సేవలను ప్రారంభించినుంది. ఇందుకు సంబంధించిన పనులను సైతం ప్రభుత్వ రంగ సంస్థ ప్రారంభించేసింది. అతి త్వరలోనే భారత్లో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘క్వాంటమ్ 5జీ’ (Q-5G) బ్రాండ్ కింద ఈ సర్వీసులను బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా 90,000 టవర్లను అమర్చినట్లు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. దీంతో 5జీ సర్వీస్కి మేము సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలను సైతం ఇచ్చేసింది. త్వరలో ఈ సంఖ్యను లక్షకు చేరవేయాలని లక్ష్యంతో పనులను చేపడుతోంది.
ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే దిల్లీ, లక్నో, జైపూర్, కోల్కతా, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో 5జీ ట్రయల్స్ను సైతం ప్రారంభించింది. అంతే కాకుండా వినియోగదారుల కోసం ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) సేవలు ప్రారంభించిన బీఎస్ఎన్ఎల్.. దీనిద్వారా సిమ్ కార్డు అవసరం లేకుండానే హైస్పీడ్ ఇంటర్నెట్ను అందిస్తోంది.
ఆఫర్: 5జీ నెట్వర్క్ని తీసుకువస్తున్న క్రమంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు తాజాగా వినియోగదారుల కోసం ప్రత్యేక డేటా ఆఫర్ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. జూన్ 28 నుంచి ఈ ‘ఫ్లాష్ సేల్’ కొనసాగుతోంది. కేవలం రూ. 400లకే 400 జీబీ హైస్పీడ్ 4జీ డేటాను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 40 రోజులు. అంటే ఒక్కో రూపాయికి 1GB డేటా చొప్పున లభించనుంది. ఈ ఆఫర్ని పొందాలంటే కస్టమర్లు ఎగ్జిస్టింగ్ ప్లాన్ రీఛార్జ్ చేసుకుని ఉండాలి. అయితే ఇది కేవలం డేటా రీఛార్జ్ మాత్రమే కావడంతో కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ కస్టమర్లకు లభించదు. పైన చెప్పిన విధంగా కేవలం తమ ప్రస్తుత ప్లాన్కి అదనంగా యాడ్ఆన్గా ఈ డేటా ప్లాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ 5జీ సేవలన్నీ దేశీయంగా అభివృద్ధి చేయబడిన టెక్నాలజీతోనే బీఎస్ఎన్ఎల్ రూపొందిస్తోంది. ఇందుకోసం టీసీఎస్, తేజస్ నెట్వర్క్స్, సీ-డాట్, ఐటీఐల మద్దతుతో నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్ను బీఎస్ఎన్ఎల్ డెవలప్ చేస్తోంది. ఈ ఫ్లాష్ సేల్తో పాటు అధికారికంగా కొత్త 5జీ బ్రాండ్ని సైతం ప్రభుత్వ రంగ సంస్థ ప్రమోట్ చేసుకోనుంది. ఎక్కువ మంది కస్టమర్లను చాలా తక్కువ ధరకే ఇంటర్నెట్ని అందించడం ద్వారా రాబట్టుకోవచ్చని భావిస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల నుంచే పూర్తి స్థాయిలో 5జీ సేవలను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇస్తోంది. దీని ద్వారా వినియోగదారులకు సీమ్లెస్ సర్వీస్ని అందిచాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. రానున్న రోజుల్లో తక్కువ ధరకే హైస్పీడ్ ఇంటర్నెట్, కాల్స్ సౌకర్యాన్ని అందించడం ద్వారా ప్రైవేట్ టెలికాం సంస్థలకు బీఎస్ఎన్ఎల్ గట్టి పోటీ ఇవ్వనుంది.