Penalty to Snapdeal: ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్ఫామ్ స్నాప్డీల్కు సీసీపీఏ రూ. 5 లక్షల జరిమానా విధించింది. తప్పనిసరి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) సర్టిఫికేషన్కు అనుగుణంగా లేని బొమ్మలను విక్రయించినందుకు ఈ జరిమానా విధించినట్లు సీసీపీఏ వెల్లడించింది. అదేవిధంగా స్నాప్డీల్కు పలు మార్గనిర్దేశకాలు జారీ చేసింది.
Also Read: https://teluguprabha.net/national-news/tamilnadu-bjp-chief-nagendran-says-sorry-to-trisha/
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) ప్రమాణాలను పాటించని బొమ్మలను(Toys) విక్రయించినందుకు.. ప్రముఖ ఇ- కామర్స్ ప్లాట్ఫామ్ స్నాప్డీల్కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) రూ. 5 లక్షల జరిమానా విధించింది. 2020 టాయ్స్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ను ఉల్లంఘించి నకిలీ లేదా నాణ్యత లేని టాయ్స్ను విక్రయించినట్లు తేలినట్లు ఈ చర్య తీసుకున్నట్లు సీసీపీఏ చీఫ్ కమిషనర్ నిధి ఖరే తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని.. ఫిర్యాదుల పరిష్కార అధికారి వివరాలను యాప్లో ప్రదర్శించాలని స్నాప్డీల్కు ఆదేశాలు జారీ చేసింది.
CCPA నిబంధనల ప్రకారం, నిబంధనలు పాటించని బొమ్మలను ప్లాట్ఫారమ్ నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఇలాంటి టాయ్స్ చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. ఈ మేరకు జనవరి 1, 2021 నుంచి టాయ్స్కు BIS సర్టిఫికేషన్ CCPA తప్పనిసరి చేసింది. భారత్లో విక్రయించే అన్ని బొమ్మలకు BIS ధృవీకరణ తప్పనిసరి. మరోవైపు స్నాప్డీల్తో పాటు ఈ నిబంధనలు ఉల్లంఘించిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇతర ఇ-కామర్స్ సంస్థలకు, స్టాలియన్ ట్రేడింగ్ కంపెనీ, ఎలక్ట్రానిక్స్ బజార్ స్టోర్ వంటి విక్రేతలకు కూడా CCPA నోటీసులు జారీ చేసింది.
అయితే సీసీపీఏ జరిమానాపై స్నాప్డీల్ స్పందించింది. తాము కేవలం మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరిస్తున్నామని, విక్రేతల ఉత్పత్తుల నాణ్యతకు బాధ్యత వహించలేమని స్నాప్డీల్ వెల్లడించింది.

