Centre takes key decision amidst fuel shortage: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, హర్మూజ్ జలసంధిపై ప్రతిష్టంభన కారణంగా ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 90 రోజుల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. ఒక వాహనానికి రోజుకు 200 లీటర్ల కంటే ఎక్కువ డీజిల్ నింపవద్దని రిటైల్ అవుట్లెట్ల యాజమాన్యాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా బల్క్ పెట్రోల్, డీజిల్ ధరల్లో, రిటైల్ ధరల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ముఖ్యంగా డీజిల్ ధర పెట్రోల్ బంకుల్లో లీటర్కు రూ.95.20 ధర ఉండగా.. బల్క్ ధర రూ.134.50 పలుకుతోంది. దీంతో, ఇటీవల కొన్ని పరిశ్రమ వర్గాలకు చెందిన, వాణిజ్య వినియోగదారులు బల్క్ సప్లయ్ చైన్ల నుంచి కాకుండా పెట్రోల్ బంకుల నుంచి ఎక్కువ మొత్తంలో పెట్రోల్, డీజిల్ను కొనుగోలు చేస్తున్నారు.
వారు రిటైల్ బంకుల నుంచి కొనొద్దు..
ఇటీవలి కాలంలో కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు అసాధారణ స్థాయిలో పెరిగినట్లు అధికారులు గుర్తించారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో రిటైల్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీన్ని అరికట్టేందుకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాలిచ్చింది. పరిశ్రమ, వాణిజ్య అవసరాల కోసం రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయకుండా నిషేధం విధించింది. బల్క్ సప్లయ్ చైన్ల నుంచే వారు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. అంతేగాక, పెట్రోల్ బంకుల వద్ద ఒక వాహనానికి లేదా ఒక కస్టమర్కు రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ను విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ డీజిల్ను ఇతరులకు ఎట్టి పరిస్థితిలోనూ విక్రయించకూడదని సూచించింది. ఈ ఆదేశాలు తొలుత 90 రోజుల వరకు అమల్లో ఉంటాయని, అవసరమైతే పరిస్థితిని బట్టి మళ్లీ పొడిగిస్తామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

