Crude Oil Crisis: అమెరికా-ఇరాన్ మధ్య సెగలు పుడుతున్న రాజకీయ విద్వేషం, ఇప్పుడు ప్రపంచ దేశాల వంటిళ్లలో మంట పెడుతోంది. అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ , ఇరాన్ మధ్య ముదురుతున్న ‘మాటల యుద్ధం’ అంతర్జాతీయ చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తోంది.
ఆకాశమే హద్దుగా ముడి చమురు ధరలు
సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 70 డాలర్ల మార్కును దాటేసింది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ను హెచ్చరించిన మరుక్షణమే మార్కెట్లు ఉలిక్కిపడ్డాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ 2.4 శాతం పెరగగా, అమెరికా బెంచ్మార్క్ WTI కూడా 2.6 శాతం ఎగబాకి 64.82 డాలర్లకు చేరుకుంది.
హార్ముజ్ జలసంధిపై నీలినీడలు
ఈ వివాదంలో అత్యంత ప్రమాదకరమైన అంశం హార్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన ఈ మార్గం ద్వారా జరిగే రవాణాకు అంతరాయం కలిగితే, పరిస్థితి ఊహకందని విధంగా మారుతుంది. ఇరాన్ రోజువారీ ఉత్పత్తి చేసే 30 లక్షల బ్యారెళ్ల చమురు మార్కెట్కు దూరం కావడం అంటే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ.
Heritage Foods Crash: ఏపీ సీఎం కుటుంబానికి ఒక్కరోజులోనే 100 కోట్ల నష్టం
ట్రంప్ హెచ్చరిక.. ఇరాన్ సవాల్
చర్చలకు రండి.. లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని ట్రంప్ అల్టిమేటం జారీ చేయగా, ఏదైనా సైనిక చర్య జరిగితే మా స్పందన అంతే కఠినంగా ఉంటుంది అని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి ధీటుగా బదులిచ్చారు.
సామాన్యుడిపై ప్రభావం
ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో భారత్ వంటి దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్ళీ భగ్గుమనే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు చమురును సురక్షిత ఇన్వెస్ట్మెంట్గా భావించి కొనుగోళ్లు పెంచుతుండటంతో ధరలకు రెక్కలు వస్తున్నాయి.

