Digital payments : కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న జీఎస్టీ రేట్ల తగ్గింపు నిర్ణయం దేశవ్యాప్తంగా వినియోగదారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ ఊహించని శుభవార్త వెలువడగానే, దేశవ్యాప్తంగా కొనుగోళ్లు అమాంతం వెల్లువెత్తాయి. దీని ఫలితంగా డిజిటల్ చెల్లింపుల రంగంలో చరిత్రలో నిలచిపోయే రికార్డు నమోదైంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, జీఎస్టీ రేట్లు తగ్గిన తొలిరోజైన సెప్టెంబర్ 22న ఏకంగా రూ. 11 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి.
10 రెట్లు పెరిగిన లావాదేవీల విలువ
ఈ భారీ పెరుగుదల మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే, అంతకుముందు రోజు (సెప్టెంబర్ 21న) దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం డిజిటల్ చెల్లింపుల విలువ కేవలం రూ. 1.1 లక్షల కోట్లు మాత్రమే. ఒక్కరోజులోనే లావాదేవీల విలువ ఏకంగా 10 రెట్లు పెరగడం, వినియోగదారులు జీఎస్టీ తగ్గింపు అవకాశాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకున్నారో స్పష్టం చేస్తోంది.
ఈ భారీ లావాదేవీల పెరుగుదలలో RTGS (రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్) వాటా సింహభాగం కావడం గమనార్హం.
RBI: డిజిటల్ చెల్లింపుల్లో కొత్త నిబంధనలు
RTGS ద్వారా: రూ. 8.2 లక్షల కోట్లు
NEFT ద్వారా: రూ. 1.6 లక్షల కోట్లు
UPI ద్వారా: రూ. 82,477 కోట్లు
ఈ-కామర్స్పై భారీ ప్రభావం
జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఈ-కామర్స్ రంగంలో కూడా స్పష్టంగా కనిపించింది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘రెడ్సీర్’ నివేదిక ప్రకారం, రేట్లు తగ్గిన తొలి రెండు రోజుల్లోనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అమ్మకాలు 23 నుంచి 25 శాతం మేర పెరిగాయి.
ముఖ్యంగా, ఆన్లైన్ లావాదేవీల్లో క్రెడిట్ కార్డుల వాడకం అనూహ్యంగా పెరిగింది.క్రెడిట్ కార్డు చెల్లింపులు దాదాపు 6 రెట్లు పెరిగి రూ. 10,411 కోట్లకు చేరాయి.డెబిట్ కార్డుల ద్వారా జరిగిన చెల్లింపులు కూడా 4 రెట్లు పెరిగి రూ. 814 కోట్లుగా నమోదయ్యాయి. జీఎస్టీ రేట్ల తగ్గింపు అనేది దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారుల కొనుగోలు శక్తిని, డిజిటల్ చెల్లింపుల వేగాన్ని ఏ స్థాయిలో ప్రభావితం చేయగలదో ఈ గణాంకాలు నిరూపించాయి.


