EPS pension: ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (EPFO) ఆధ్వర్యంలోని ఈపీఎస్-95 పథకం కింద అందే పెన్షన్ డబ్బులకు సంబంధించిన కీలక గణాంకాలను కేంద్రం వెల్లడించింది. ఈ పథకం కింద దాదాపు 81 లక్షల మంది పెన్షన్దారులు లబ్ధి పొందుతున్నారు. అయితే, అందులో కేవలం 0.65 శాతం మందికి మాత్రమే నెలకు రూ.6 వేలకు పైగా పెన్షన్ అందుతోందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్సభలో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం 81,48,490 మంది పెన్షన్దారుల్లో కేవలం 53,541 మందికి మాత్రమే ఆ మొత్తం కంటే ఎక్కువ పెన్షన్ లభిస్తోందని రాతపూర్వక సమాధానంలో తెలిపారు.
Read Also: EV Race Heats Up: హీటెక్కిన ఈవీ రేస్.. తొలిస్థానానికి ఎగబాకిన ఏథర్
ఇకపోతే, ఈపీఎస్-95లో కనీస పెన్షన్ను నెలకు రూ.9 వేలు చేయాలని ట్రేడ్ యూనియన్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ పథకం కింద కనీస పెన్షన్ రూ.వెయ్యి మాత్రమే లభిస్తోంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి నెలకు రూ.1500 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య 49,15,416గా ఉన్నట్లు మంత్రి తెలిపారు. అంటే సగం మంది కంటే ఎక్కువ మందికి నెలకు రూ.1500 కూడా అందడం లేదు. ఈ పథకం కింద 2022-23లో రూ.22,112.83 కోట్లు పెన్షన్ రూపంలో చెల్లించగా.. 2023-24లో రూ.23,027.93 కోట్లకు పెరిగిందని తెలిపారు. మొత్తం రూ.10,898.07 కోట్లు నిరుపయోగంగా ఉన్న ఖాతాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. 2024-25 వార్షిక ఖాతాల ఆడిట్ పూర్తికావాల్సి ఉందని వెల్లడించారు. 2022-23లో రూ.52,171 కోట్లుగా ఉన్న ఈపీఎఫ్వో వడ్డీ ఆదాయం 2023-24లో రూ.58,668.73 కోట్లకు పెరిగిందన్నారు. అంతేకాక జరిమానాలు, వడ్డీలు తదితరంగా లభించే ఇతర ఆదాయం రూ.564.21 కోట్ల నుంచి రూ.863.62 కోట్లకు పెరిగిందని సమాధానంలో వెల్లడించారు.
Read Also: S Jaishankar: ఆ వాదనల్లో లాజిక్ లేదు.. అమెరికాపై జైశంకర్ సంచలన వ్యాఖ్యలు


