Salary to EMI: జీతం రాగానే సెల్ఫోన్ మోగే ఆ క్రెడిట్ మెసేజ్ ఇచ్చే ఆనందం సెకన్ల పాటే.. ఆ వెంటనే క్యూ కడుతున్న ఈఎంఐ డెబిట్ మెసేజ్లు భారతీయ మధ్యతరగతి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఒకప్పుడు అప్పు అంటే అవసరానికి తీసుకునే ఆసరా.. కానీ ఇప్పుడు అది ప్రతినెలా తప్పనిసరిగా చెల్లించాల్సిన శాపంగా మారింది. కేవలం విలాసాల కోసం చేసే ఖర్చు మాత్రమే కాదు, సులభంగా దొరుకుతున్న అప్పులు సామాన్యుడిని ఊబిలోకి నెట్టేస్తున్నాయి.
గణాంకాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే
రుణ పరిష్కార సంస్థ ఎక్స్పర్ట్ ప్యానెల్ జూన్, డిసెంబర్ 2025 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 10,000 మంది రుణగ్రహీతలపై నిర్వహించిన సర్వే విస్తుపోయే నిజాలను బయటపెట్టింది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది తమ ఆదాయంలో 40 శాతం కంటే ఎక్కువ భాగాన్ని కేవలం ఈఎంఐలకే వెచ్చిస్తున్నారు.నెలవారీ ఆదాయం రూ.35,000 నుండి రూ.65,000 ఉన్నవారు, సగటున రూ.28,000 నుండి రూ.52,000 వరకు ఈఎంఐలు చెల్లిస్తున్నారు. అంటే చేతిలో మిగిలేది నామమాత్రమే. ఈ రుణ ఒత్తిడి వల్ల 65 శాతం మంది తమ పిల్లల పాఠశాల ఫీజులు, వైద్య ఖర్చులు, చివరకు ఆహార బడ్జెట్ను కూడా తగ్గించుకుంటున్నారు.
Bengaluru Techie Murder : శృంగరానికి నో చెప్పిందని.. పక్కంటి అమ్మాయిని ఏం చేశాడంటే..?
అప్పుల ఊబిలోకి ఎలా చేరుతున్నాం?
అప్పుల చక్రం ఒక విషవలయంలా మారుతోంది. ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలు ఇవే.. సెల్ఫోన్ ఉంటే చాలు.. నిమిషాల్లో లోన్ ఇచ్చే యాప్లు, బై నౌ – పే లేటర్ పథకాలు అప్పు తీసుకోవడాన్ని చాలా సులభం చేసేశాయి.నెలకు వెయ్యి రూపాయల ఈఎంఐయే కదా అని మొదలుపెట్టి, అలాంటివి పది కలిపి పదివేలు ఎప్పుడు అవుతాయో తెలియని పరిస్థితి.క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి పర్సనల్ లోన్ తీసుకోవడం లేదా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాకపోగా మరింత జటిలమవుతోంది.
జీవితం మీద రుణ ప్రభావం
ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, సామాజిక సంక్షోభం కూడా. సర్వే ప్రకారం 50 శాతం మంది రుణగ్రహీతలు తీవ్రమైన మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కుటుంబ కలహాలను ఎదుర్కొంటున్నారు. రికవరీ ఏజెంట్ల వేధింపులు, న్యాయపరమైన నోటీసులు మనిషిని ఆత్మరక్షణలో పడేస్తున్నాయి.
విలాసాల కోసం ఈఎంఐలపై ఆధారపడటం కంటే, అవసరాల కోసం పొదుపు చేయడం ఉత్తమం. ఒక వస్తువు ఈఎంఐలో వస్తుంది కదా అని కొనేముందు, మీ నెలవారీ బడ్జెట్లో అది ఎంత శాతం ఆక్రమిస్తుందో ఒక్కసారి ఆలోచించండి.

