Mutual Funds : ప్రజల్లో ఆర్థిక అంశాల పట్ల అవగాహన పెరగటంతో పాటు మారుతున్న పరిస్థితులను తట్టుకోవటానికి ఖచ్చితంగా పెట్టుబడులు అవసరం అనే పరిజ్ఞానం పెరగటంతో చాలా మంది తమ సంపాదనలో కొంత భాగాన్ని దాచుకుంటున్నారు. పట్టణాల్లో జాబ్స్ చేసే ప్రజలు ఆదాయం పెరుగుదలను సేవింగ్స్ గా మార్చుతూ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లు, క్రిప్టోలు వంటి కొత్త తరం సాధనాలను పెట్టుబడులకు ఉపయోగిస్తున్నారు. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్లను వీడినప్పటికీ వారి స్థానాన్ని డొమెస్టిక్ పెట్టుబడిదారులు భర్తీ చేయటం తద్వారా మార్కెట్ల స్థిరత్వానికి దోహదపడుతోంది.
ప్రస్తుతం ఎస్ఐపీ కల్చర్ పెరుగుదలతో దేశంలో మొత్తం మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువ రూ. 65.74 లక్షల కోట్లకు ఎగబాకింది. వీటిలో ఎక్కువదారు నగరాల్లోని ప్రజల నుంచే పెట్టుబడిగా వస్తున్నాయి. తొలి స్థానంలో నిలిచిన ముంబై రూ.17.75 లక్షల కోట్లతో 27% వాటాను ఇచ్చింది. తర్వాతి స్థానంలో ఉన్న ఢిల్లీ 12.6%, బెంగళూరు 5.4%, పూణె 4%, కోల్కతా 3.5% వాటాతో కొనసాగుతున్నాయి.
అత్యంత ముఖ్యమైన ట్రెండ్ ఏంటంటే మహిళా పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరగటమే. అవును ప్రతి నలుగురు పెట్టుబడిదారుల్లో ఒక మహిళా ఇన్వెస్టర్ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 2025 నాటికి 5.34 కోట్ల పెట్టుబడిదారుల్లో 1.38 కోట్లు (ఏకంగా 25.9%) మహిళలు ఉన్నారు. 6 ఏళ్ల క్రితం నాటికి ఈ స్థానం కేవలం 24.2% మాత్రమే. ఇది నారీశక్తి ఆర్థిక పాత్ర పెరుగుతోందని నిరూపిస్తోంది.
భారత మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో రిటైల్ ఇన్వెస్టర్ల వాటా 63.2%గా ఉంది. విస్తృతంగా వారి లాభాలు ఈక్విటీ ఫండ్లలో ఉన్నాయ్. తర్వాత హైబ్రిడ్, డెట్, ప్యాసివ్ ఫండ్లలో కూడా పెట్టుబడులు పెరిగాయి. పెద్ద నగరాల్లో సంస్థలు/కంపెనీలు ఎక్కువగా పెట్టుబడి పెడితే, చిన్న రాష్ట్రాల్లో వ్యక్తిగత పెట్టుబడిదారుల పాత్ర మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. త్రిపుర, లక్షద్వీప్, బీహార్ల్లో వ్యక్తిగత పెట్టుబడిదారుల వాటా 95% కన్నా ఎక్కువగా ఉందని తేలింది.
కరోనా తరువాత మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయటానికి యువత భారీగా వచ్చి చేరింది. ఫోన్, వెబ్ప్లాట్ఫామ్స్ ద్వారా పెట్టుబడి మరింత సులభంగా మారడం వలన కోట్ల సంఖ్యలో కొత్త ఖాతాలు తెరవబడ్డాయి. సెప్టెంబర్ 2025 నాటికి SIP ఖాతాల సంఖ్య, పెట్టుబడుల మొత్తం నిలకడగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకూ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో 52.5% పెద్ద నగరాల ఇన్వెస్టర్ల నుంచే వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే స్థాయికి తీసుకెళ్లాలంటే మరింత ఫైనాన్షియల్ అవగాహన అవసరం. సామాన్యులకూ, మహిళలకూ, యువతరానికీ మరింత శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతుంది. ఎక్కువ పెట్టుబడులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి వస్తున్నాయని తేలింది.


