KLM-Flights:హైదరాబాద్ నుంచి ఆమ్స్టర్డామ్ షిపోల్ విమానాశ్రయానికి కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ తన కొత్త డైరెక్ట్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. సెప్టెంబర్ 3న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కేఎల్ 874 నంబర్ ఫ్లైట్ బయలుదేరి ఆమ్స్టర్డామ్లో ల్యాండ్ కావడంతో ఈ కొత్త మార్గం ఆరంభమైంది. ఇప్పటికే బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నుంచి నేరుగా సేవలను అందిస్తున్న కేఎల్ఎం, హైదరాబాద్ను తన నాలుగో భారతీయ గేట్వేగా చేర్చింది.
ఇతర ఖండాలకు కనెక్టివిటీ..
కేఎల్ఎం గ్లోబల్ నెట్వర్క్లో 160కి పైగా గమ్యస్థానాలు ఉన్నాయి. హైదరాబాద్ ఈ జాబితాలో చేరడంతో యూరప్తో పాటు ఇతర ఖండాలకు కనెక్టివిటీ మరింతగా బలోపేతం కానుంది. ఈ మార్గం ద్వారా ప్రయాణికులు సులభంగా ఉత్తర అమెరికా, యూరప్ , మరిన్ని కీలక ప్రాంతాలకు చేరుకునే అవకాశాన్ని పొందనున్నారు.
కొత్త డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం..
హైదరాబాద్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా నిలుస్తోంది. ఫార్మా పరిశ్రమల కేంద్రంగా ప్రసిద్ధి చెందిన ఈ నగరం బయోటెక్నాలజీ, లైఫ్సైన్సెస్, ఆరోగ్య రంగాల్లో కూడా గణనీయమైన స్థానం సంపాదించింది. అంతేకాకుండా అమెరికా, యూరప్ ఐటీ కంపెనీలు ఇక్కడ విస్తృతంగా స్థాపించుకోవడంతో అంతర్జాతీయ కనెక్టివిటీపై డిమాండ్ పెరుగుతోంది. ఈ కొత్త డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభం ఆ అవసరాలను తీర్చడమే కాకుండా, హైదరాబాద్ గ్లోబల్ వ్యాపార రంగంలో మరింతగా దృష్టిని ఆకర్షించనుంది.
కేఎల్ఎం ప్రతినిధులు చెబుతున్నట్లుగా, భారత్ గత 70 ఏళ్లుగా సంస్థకు కీలకమైన మార్కెట్. ప్రయాణికుల సంఖ్య నిరంతరం పెరుగుతుండటంతో బలమైన కనెక్షన్ల ప్రాధాన్యత మరింత స్పష్టమవుతోంది. ప్రస్తుతం భారతదేశంలోని నాలుగు ప్రధాన నగరాల నుంచి వారానికి 22 విమానాలను నడుపుతున్న కేఎల్ఎం, శీతాకాలం నాటికి ఈ సంఖ్యను 27కి పెంచాలని ప్రణాళిక వేసుకుంది.
40 డచ్ కంపెనీలు..
నెదర్లాండ్స్ రాయబారి మారిసా గెరార్డ్స్ అభిప్రాయపడుతూ, హైదరాబాద్ కేఎల్ఎం సేవలకు చేరడం గర్వకారణమని తెలిపారు. 105 ఏళ్ల వారసత్వంతో ఉన్న ఈ ఎయిర్లైన్స్ డచ్ ఆతిథ్యానికి ప్రతీకగా నిలిచిందని ఆమె అన్నారు. హైదరాబాద్ ఐటీ, లైఫ్సైన్సెస్, ఔషధ తయారీ రంగాలలో ప్రముఖ స్థానంలో ఉందని, ఈ కొత్త మార్గం వాణిజ్యం, ఆవిష్కరణ, పర్యాటక రంగాలకు కొత్త అవకాశాలను తెస్తుందని వివరించారు. ఈ ప్రాంతంలో దాదాపు 40 డచ్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, కొత్త డైరెక్ట్ ఫ్లైట్ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు.
జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సీఈఓ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ, ఈ కొత్త సేవలు హైదరాబాద్ గ్లోబల్ మ్యాప్లో స్థానం మరింత బలపడేలా చేస్తున్నాయని పేర్కొన్నారు. దక్షిణ భారతదేశం నుంచి యూరప్ మరియు ఉత్తర అమెరికాకు కనెక్టివిటీ సులభతరం అవుతుందని, ప్రపంచ వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత మజ్బూతం అవుతుందని ఆయన అన్నారు. అంతర్జాతీయ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలో జీఎంఆర్ ఎయిర్పోర్ట్ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.
కొత్త సేవల కోసం టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు ముందుగానే తమ ప్రణాళికలకు అనుగుణంగా సీట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం, కేఎల్ 874 ఫ్లైట్ హైదరాబాద్ నుంచి స్థానిక సమయం ప్రకారం ఉదయం 2.20 గంటలకు బయలుదేరి, ఆమ్స్టర్డామ్లో ఉదయం 8.40 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కేఎల్ 873 ఆమ్స్టర్డామ్ నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 12.30 గంటలకు హైదరాబాద్లో ల్యాండ్ అవుతుంది.


