Layoffs In Popular E-commers Amazon Company: భారతదేశ ఐటీ రంగంలో అనిశ్చితి నెలకొంది. ఓవైపు, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) రాక, మరోవైపు, నిర్వహణ ఖర్చుల భారంతో ఐటీ కంపెనీలు మళ్లీ లేఆఫ్లను షురూ చేశాయి. ఇటీవలి కాలంలో తమ ఖర్చులు తగ్గించుకునేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టీసీఎస్ లాంటి అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ వచ్చి చేరింది. అమెజాన్ మళ్లీ లేఆఫ్లు జరగనున్నట్లు తెలుస్తోంది. మానవ వనరుల (హెచ్ఆర్) విభాగంలో ఏకంగా 15 శాతం సిబ్బందిని తొలగించేందుకు అమెజాన్ సిద్ధమవుతున్నట్లు ఆ కంపెనీ వెల్లడించినట్లు ఫార్చ్యూన్ పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ కథనం ప్రకారం, అమెజాన్లో త్వరలోనే భారీ ఉద్యోగుల కోత ఉండనుందని తెలుస్తోంది. దీంతో సంస్థ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎవరికి పింక్ స్లిప్ జారీ అవుతుందోనని ఆందోళనలో ఉన్నారు. ఈ ఉద్యోగ కోత కేవలం హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనే కాకుండా ఇతర విభాగాల్లోని ఉద్యోగులపై కూడా ప్రభావం పడనుంది. అయితే, ఈ లేఆఫ్లు ఎప్పటినుంచి ఉంటాయి? ఎంతమందిని తొలగిస్తారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఇదే విషయంపై అమెజాన్ ప్రతినిధి కెల్లీ నాంటెల్ను మీడియా పలు ప్రశ్నలు అడగ్గా.. ఆయన లేఆఫ్స్ గురించి మాట్లాడేందుకు నిరాకరించారు.
ఏఐ రాకతో ఉద్యోగాలు ఊస్ట్..
కాగా, అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. 2022-23లో 27 వేల ఉద్యోగులను తొలగించారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం నడుస్తోందని, ప్రతి ఉద్యోగి ఏఐ సామార్థ్యాలు పెంచుకోవాలని కోరారు. తమ కంపెనీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ని మరింత విస్తరింపజేయడం వల్ల ఉద్యోగులను కోల్పోవాల్సి వస్తుందనే విషయాన్ని పేర్కొన్నారు. మరోవైపు, అమెజాన్ లేఆఫ్లు ప్రకటిస్తూనే.. సీజనల్ ఉద్యోగులను నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పండుగల సీజన్ దృష్ట్యా యూఎస్ గిడ్డంగులు, లాజిస్టిక్స్ నెట్వర్క్లో 2,50,000 మంది సీజనల్ ఉద్యోగులను నియమించేందుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ఏఐని అందిపుచ్చుకోవడంతో సహా క్లౌడ్ కార్యకలాపాల కోసం అమెజాన్ సంస్థ బిలియన్ల డాలర్లు కేటాయిస్తోంది. ఈ ఏడాది మూలధన పెట్టుబడుల్లో 100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చు చేయాలని అమెజాన్ నిర్ణయం తీసుకుంది. ఇందులో అధిక మొత్తాన్ని నెక్ట్స్ జనరేషన్ డేటా సెంటర్లను నిర్మించేందుకు కేటాయించింది. కాగా, ఒకప్పుడు స్థిరమైన కెరీర్, లక్షల్లో వేతనాలు, కలర్ఫుల్ లైఫ్గా భావించబడిన సాఫ్ట్వేర్ రంగంలో ఇప్పుడు ఉద్యోగ భద్రతపై అనిశ్చితి నెలకొంది. తాజా నివేదికల ప్రకారం.. 2025 చివరి నాటికి దాదాపు 50,000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఈ తొలగింపులు గతంలోలా బహిరంగంగా కాకుండా, నిశ్శబ్ద తొలగింపుల రూపంలో జరుగుతున్నాయి. అంటే ఉద్యోగులను ప్రత్యక్షంగా తొలగించకుండా, ఇతర మార్గాల్లో సంస్థలు వారిని వెళ్లగొడుతున్నాయి.


