LIC Bima Sakhi Scheme:కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మహిళలకు ఆర్థికంగా నిలదొక్కుకునే దిశగా మరో కీలక అడుగు వేసింది. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎల్ఐసీ బీమా సఖీ యోజన అనే కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ పథకం ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించింది. బీమా రంగంలో పని చేయాలని ఆసక్తి ఉన్న మహిళలకు ఇది ఒక కొత్త దారి చూపించే అవకాశంగా భావిస్తున్నారు.
బీమా సఖీ యోజన..
బీమా సఖీ యోజనలో భాగంగా మహిళలకు మాత్రమే ఎల్ఐసీ ఏజెంట్లుగా పని చేసే అవకాశం ఉంటుంది. గతంలో ఏజెంట్గా చేరాలంటే పూర్తిగా కమిషన్ ఆధారంగా ఆదాయం పొందాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త పథకం ద్వారా మహిళలకు మొదటి మూడు సంవత్సరాల పాటు శిక్షణతో పాటు నెలవారీ స్ట్రైఫండ్ కూడా అందించనున్నారు. దీంతో కొత్తగా రంగంలోకి వచ్చే మహిళలకు ఆర్థిక భద్రత కలుగుతుందని ఎల్ఐసీ అధికారులు భావిస్తున్నారు.
పాలసీల ప్రయోజనాలు..
ఈ పథకంలో చేరిన మహిళలకు మొదటి మూడు సంవత్సరాలు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ కాలంలో బీమా పాలసీలు, ఖాతాదారుల అవసరాలు, పాలసీల ప్రయోజనాలు, విక్రయ విధానాలు వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. శిక్షణ పూర్తి అయిన తర్వాత వారు సాధారణ ఎల్ఐసీ ఏజెంట్లుగా కొనసాగవచ్చు. దీని వల్ల దీర్ఘకాలంలో స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.
ఎల్ఐసీ ఏజెంట్..
బీమా సఖీ యోజనకు అర్హత విషయానికి వస్తే, దరఖాస్తు చేసే మహిళల వయస్సు 18 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. కనీస విద్యార్హతగా పదో తరగతి ఉత్తీర్ణత అవసరం. ఈ అర్హతలు కలిగిన మహిళలు ఎల్ఐసీ ఏజెంట్గా తమ కెరీర్ను ప్రారంభించవచ్చు. మూడు సంవత్సరాల శిక్షణ కాలంలో స్ట్రైఫండ్ అందించడం ఈ పథకంలోని ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు.
ఏడు వేల రూపాయల ..
మొదటి ఏడాది మహిళలకు ప్రతి నెలా ఏడు వేల రూపాయల స్ట్రైఫండ్ అందుతుంది. రెండో ఏడాదిలో ఇది ఆరు వేల రూపాయలకు తగ్గుతుంది. మూడో ఏడాదిలో నెలకు ఐదు వేల రూపాయల స్ట్రైఫండ్ ఇస్తారు. ఈ మొత్తం శిక్షణ సమయంలో మహిళలకు కనీస ఆదాయం ఉండేలా సహాయపడుతుంది. శిక్షణ ముగిసిన తర్వాత వారు పూర్తిస్థాయి ఏజెంట్లుగా కమిషన్ ఆధారంగా ఆదాయం పొందవచ్చు.
చివరి నాలుగు నెలల్లో..
కమిషన్ విధానం కూడా స్పష్టంగా నిర్ణయించారు. పాలసీల విక్రయాల ఆధారంగా కమిషన్ చెల్లిస్తారు. మొదటి నాలుగు నెలల్లో నెలకు రెండు వేల రూపాయల వరకు కమిషన్ లభించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతి నాలుగు నెలల్లో ఇది నెలకు నాలుగు వేల రూపాయల వరకు పెరుగుతుంది. చివరి నాలుగు నెలల్లో నెలకు ఆరు వేల రూపాయల వరకు కమిషన్ పొందవచ్చు. ఈ విధంగా పాలసీల సంఖ్యను బట్టి ఏడాదికి నలభై ఎనిమిది వేల రూపాయల వరకు కమిషన్ వచ్చే అవకాశం ఉందని ఎల్ఐసీ తెలిపింది.
విద్యార్హతలు ఎక్కువగా..
విద్యార్హతలు ఎక్కువగా ఉన్న మహిళలకు మరింత ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. డిగ్రీ పూర్తి చేసిన మహిళలు భవిష్యత్తులో ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. దీంతో బీమా రంగంలో దీర్ఘకాల కెరీర్ నిర్మించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
ఈ స్కీమ్లో చేరేందుకు..
అయితే ఈ పథకానికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎల్ఐసీ ఏజెంట్లుగా పని చేస్తున్న మహిళలు ఈ స్కీమ్లో చేరేందుకు అర్హులు కారు. అలాగే గతంలో ఎల్ఐసీ ఏజెంట్లుగా పనిచేసిన మహిళలు లేదా ఏజెంట్లకు బంధువులైన వారు కూడా ఈ పథకానికి అనర్హులు. పూర్తిగా కొత్తగా ఎల్ఐసీ ఏజెంట్గా చేరాలనుకునే మహిళల కోసమే ఈ పథకం రూపొందించారు.
దరఖాస్తు ప్రక్రియ కూడా సులభంగా ఉండేలా ఎల్ఐసీ ఏర్పాటు చేసింది. ఆసక్తి ఉన్న మహిళలు ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో వ్యక్తిగత వివరాలు, వయస్సు, విద్యార్హతలు, చిరునామాకు సంబంధించిన పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సమర్పించిన వివరాలను ఎల్ఐసీ అధికారులు పరిశీలించిన తర్వాత అర్హులైన మహిళలను ఎంపిక చేస్తారు.
Also Read:https://teluguprabha.net/business/how-to-build-one-crore-wealth-in-ten-years-with-mutual-funds/
గతంలో మహిళలు ఏజెంట్లుగా చేరినప్పుడు పురుషుల మాదిరిగానే పూర్తిగా కమిషన్ ఆధారిత ఆదాయంపైనే ఆధారపడాల్సి వచ్చేది. కొత్తగా రంగంలోకి వచ్చే వారికి అది ఒక సవాలుగా మారేది. ఇప్పుడు బీమా సఖీ యోజన ద్వారా శిక్షణతో పాటు నెలవారీ స్ట్రైఫండ్ అందించడం వల్ల ఆ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఈ మార్పు మహిళలను బీమా రంగం వైపు ఆకర్షించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

