Saturday, November 15, 2025
Homeబిజినెస్Stock Market : మోదీ జీఎస్టీ మంత్రం.. మార్కెట్లకు లాభాల తంత్రం!

Stock Market : మోదీ జీఎస్టీ మంత్రం.. మార్కెట్లకు లాభాల తంత్రం!

Impact of GST rate cuts on stock market :  దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం కొత్త ఉత్సాహంతో ఉరకలేశాయి. సూచీలు భారీ లాభాలతో ప్రారంభమై, మదుపరులకు లాభాల పండగను చూపించాయి. సెన్సెక్స్ ఏకంగా 1000 పాయింట్లకు పైగా ఎగబాకి సరికొత్త రికార్డుల దిశగా పరుగులు పెట్టగా, నిఫ్టీ సైతం కీలక స్థాయిలను అధిగమించింది. అసలు ఈ ఆకస్మిక బుల్ పరుగుకు కారణమేంటి..? కేవలం ఒక్క ప్రకటనతోనే మార్కెట్ సెంటిమెంట్ ఎందుకింత సానుకూలంగా మారింది..? తెర వెనుక పనిచేసిన బలమైన కారణాలేంటి..?

- Advertisement -

మార్కెట్లకు జోష్ ఇచ్చిన మూడు కారణాలు : సోమవారం నాటి మార్కెట్ల భారీ లాభాల వెనుక ప్రధానంగా మూడు కీలక అంశాలు దోహదపడ్డాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ప్రధాని మోదీ ‘జీఎస్టీ’ కానుక: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మార్కెట్లకు అతిపెద్ద బూస్ట్‌ను ఇచ్చింది. దీపావళి పండుగ నాటికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారాన్ని గణనీయంగా తగ్గిస్తామన్న ఆయన హామీ, ముఖ్యంగా వినియోగ ఆధారిత రంగాల్లో కొత్త ఆశలు చిగురింపజేసింది. “మార్కెట్లు మరింత లాభపడేందుకు ఈ ప్రకటన మార్గం సుగమం చేసింది. ఇది అతిపెద్ద సానుకూలాంశం,” అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 28% శ్లాబులో ఉన్న ఆటోమొబైల్, సిమెంట్ వంటి రంగాలు అతిపెద్ద లబ్ధిదారులుగా నిలుస్తాయని, దీని ఫలితంగా మారుతి, హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ వంటి షేర్లు రానున్న రోజుల్లో మరింత రాణించవచ్చని ఆయన అంచనా వేశారు.

అంతర్జాతీయ రేటింగ్ అప్‌గ్రేడ్: ప్రపంచ ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ ‘ఎస్ & పీ గ్లోబల్ రేటింగ్స్’, భారత సావరిన్ క్రెడిట్ రేటింగ్‌ను ‘బీబీబీ-‘ నుంచి ‘బీబీబీ’కి పెంచడం మరో సానుకూల పరిణామం. ఈ రేటింగ్ పెంపు భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై విదేశీ సంస్థాగత మదుపరుల విశ్వాసాన్ని పెంచుతుంది. ఇది దేశంలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు రావడానికి దోహదపడుతుంది.

ప్రపంచ రాజకీయాల సానుకూల పవనాలు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక చర్చలు కూడా పరోక్షంగా మన మార్కెట్లకు మేలు చేశాయి. ఈ చర్చల పూర్తి వివరాలు బయటకు రాకపోయినా, ఇరు దేశాలు సమావేశం విజయవంతమైందని ప్రకటించాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా విధించే సుంకాల విషయంలో కొంత ఉపశమనం లభించవచ్చనే ఆశాభావం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇది కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది.

లాభనష్టాల్లో కదిలిన షేర్లు : ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో, సెన్సెక్స్ 1092 పాయింట్ల లాభంతో 81,689 వద్ద, నిఫ్టీ 320 పాయింట్ల లాభంతో 24,951 వద్ద ట్రేడ్ అయ్యాయి. మారుతి, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఎం&ఎం షేర్లు భారీ లాభాలను నమోదు చేయగా, హెచ్‌సీఎల్ టెక్, లార్సెన్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్‌జీసీ, టీసీఎస్ వంటి షేర్లు స్వల్ప నష్టాలతో ట్రేడ్ అయ్యాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad